Weather Update: ఐఎండీ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఈ రోజు వాతావరణం ఎలా ఉందంటే..

దక్షిణాది రాష్ట్రాలను వరుణుడు కరుణించడంతో మంగళవారం సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Hyderabad Rains (photo-ANI)

Weather Update: దక్షిణాది రాష్ట్రాలను వరుణుడు కరుణించడంతో మంగళవారం సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి అంతా నిరంతరాయంగా వర్షం పడటం, ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం ఉదయం వరకు వర్షం కొనసాగడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు, విధులకు వెళ్లే సాధారణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దాదాపు రెండు నెలలుగా సరైన వర్షాలు లేక తీవ్ర నిరాశలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా వర్షాల కోసం వేచి చూస్తున్న రైతులకు ఈ అకస్మాత్తు వర్షాలు ఎంతో ఊరటను, ఆనందాన్ని ఇచ్చాయి. భూగర్భ జలాలు పెరగడానికి, వ్యవసాయ పనులను వేగవంతం చేయడానికి ఈ వర్షాలు ఎంతో అనుకూలంగా మారడంతో సాధారణ ప్రజలు కూడా తీవ్ర వేడి నుండి ఉపశమనం పొంది ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ వర్షాలకు ప్రధాన కారణం.. ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి సుదీర్ఘంగా కొనసాగుతుండటమేనని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ద్రోణి మరింత బలపడి నేడు లేదా రేపు బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, ఇతర పరిసర రాష్ట్రాలలో కూడా రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఈ నెల జులై 27 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వాతావరణం ప్రతికూలంగా ఉండి, విడతలవారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రేపటి వాతావరణం సూచన, హైదరాబాద్, విజయవాడ సహా వచ్చే 7 రోజుల పాటు భారీ వర్షాలు.. 5 ప్రమాదకరమైన తుఫానులు రెడీ..

కేవలం వర్షాలే కాకుండా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. వీటితోపాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు మరియు రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు, వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో జులై 22 నుండి 27 వరకు ఈ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నివేదికలు తెలియజేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ వర్షాల హోరు దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరుగా ఉండగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం చాలా తీవ్రంగా కురిసింది.

ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్‌లో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా పరిధిలో అత్యధికంగా అతి భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలోని జనకాపూర్, కోటపల్లి, తాండూరు వంటి ప్రాంతాలలో ఒక్కరోజే ఏకంగా 12 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షం కురిసి జలమయమైంది. వీటితో పాటు పెద్దపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం మరియు జగిత్యాల జిల్లాల్లో కూడా వర్షాలు తీవ్ర స్థాయిలో కుమ్మేశాయి.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే జులై 22న వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందులోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాలు జులై 27 వరకు నిరంతరాయంగా పడే అవకాశాలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement