Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
శుక్రవారం తెల్లవారుజామున 2:51 గంటలకు హిమాలయ దేశం నేపాల్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Newdelhi, Feb 28: శుక్రవారం తెల్లవారుజామున 2:51 గంటలకు హిమాలయ దేశం నేపాల్ లో భూకంపం (Nepal Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం కారణంగా నేపాల్ లోని అనేక ప్రాంతాలలో ప్రధానంగా తూర్పు, మధ్య ప్రాంతాలలోని ప్రజలు భూప్రకంపనలకు లోనైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అటు భారత్ (India), టిబెట్, చైనా (China) సరిహద్దు ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రావడం తో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Here's Video:
వరుస భూకంపాలు
మొన్న ఢిల్లీ, బంగాళాఖాతం, నిన్న అస్సాం నేడు నేపాల్ లో సంభవిస్తున్న వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)ను గురువారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో భూకంపం (Earthquake) వణికించింది. మోరిగావ్ (Morigaon) జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. ప్రకంపనల ధాటికి భవనాలు ఊగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.