2024 భారతదేశం ఎన్నికలు: ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు
చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది.
Newdelhi, June 1: 45 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికలకు (Elections) నేటితో తెరపడనుంది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు (Loksabha) ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లో 13, బీహార్ లో 8, పశ్చిమ బెంగాల్ లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్ లో 3, పంజాబ్ లో 13, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్, గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో బరిలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపులు
నేటితో ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ సాయంత్రం ఎప్పుడవుతుందా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి.