Monsoon Update: వర్షాలు దంచికొడుతున్నా వెంటాడుతున్న ఎల్ నినో ముప్పు.. ఖరీఫ్ పంటల భవిష్యత్తుపై వ్యవసాయ నిపుణులు తీవ్ర ఆందోళన..

దేశవ్యాప్తంగా వర్షాకాలం వేగవంతమై ఆగస్టు తొలి వారంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. ఎల్ నినో (El Niño) ముప్పు వర్తమాన వ్యవసాయ రంగాన్ని, ఖరీఫ్ పంటల భవిష్యత్తును ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాంతాల వారీగా వర్షపాత పంపిణీలో అసమానతలు ఉండటం, అంతర్జాతీయంగా వాతావరణ సరళి మారుతుండటంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌పై మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Climate Change | Representational Image (Photo Credits: Pixabay)

Monsoon Update: దేశవ్యాప్తంగా వర్షాకాలం వేగవంతమై ఆగస్టు తొలి వారంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. ఎల్ నినో (El Niño) ముప్పు వర్తమాన వ్యవసాయ రంగాన్ని, ఖరీఫ్ పంటల భవిష్యత్తును ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాంతాల వారీగా వర్షపాత పంపిణీలో అసమానతలు ఉండటం, అంతర్జాతీయంగా వాతావరణ సరళి మారుతుండటంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌పై మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

రుతుపవనాల ప్రారంభంలో వర్షపాతం మందగించి రైతుల్లో ఆందోళన రేకెత్తించినప్పటికీ.. ఆగస్టు తొలి వారం నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారాయి. ఆగస్టు మొదటి ఎనిమిది రోజుల్లోనే జాతీయ రాజధాని ఢిల్లీ తన నెలవారీ సగటు వర్షపాతాన్ని దాటేసింది. 2011 తర్వాత ఆగస్టు ఆరంభంలోనే అత్యధిక వర్షపాతం నమోదు చేసిన రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా 12కి పైగా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో మొత్తం వర్షపాత లోటు 11 శాతానికి తగ్గింది. దీనివల్ల నిలిచిపోయిన ఖరీఫ్ సాగు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి.

సూపర్ ఎల్ నినో ముప్పు.. మరింతగా వేడెక్కనున్న భూమి.. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు..

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో లోటు భారీగా తగ్గింది. ముఖ్యంగా పప్పుధాన్యాల పంటల సాగు విస్తీర్ణంలో ఉన్న లోటు కేవలం 1.95 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అయితే ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, నూనెగింజల పంటలు మాత్రం సాగు విస్తీర్ణంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వరి సాగు 15.90 లక్షల హెక్టార్లు, నూనెగింజల సాగు 5.19 లక్షల హెక్టార్ల చొప్పున తగ్గాయి. మధ్య, పశ్చిమ భారతదేశంలో వర్షాలు విస్తారంగా కురిసినా, తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో వర్షపాత లోటు సాధారణం కంటే 25.5 శాతం తక్కువగా నమోదు కావడం వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపింది.

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ.. రాబోయే ఆగస్టు-అక్టోబర్ కాలంలో భారతదేశంపై ‘ఎల్ నినో’ ప్రభావం పడే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తన నివేదికలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్రంలో Positive IOD పరిస్థితులు ఏర్పడుతుండటం వల్ల సాధారణం కంటే పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ తీవ్రమైన వేడి ఒత్తిడి పంట దిగుబడులను గణనీయంగా తగ్గించే అవకాశముంది.

ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ.. ఎల్ నినో కేవలం మన ఇంటి ముంగిట మాత్రమే లేదు. అది మన ఇంట్లోనే ఉండి వేడిని పెంచుతోందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు, వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తక్షణమే నీటి యాజమాన్య పద్ధతులు, వేడి నివారణ వ్యూహాలు, కరువు సంసిద్ధత చర్యలను వేగవంతం చేయాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement