PM Modi to IITians: కొత్తగా ఆలోచించండి..! ఐఐటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, కొవిడ్ తర్వాత టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలదే కీలకపాత్ర అని వ్యాఖ్య

కొవిడ్ కారణంగా నెలకొన్న ప్రతికూలతను ఒక అవకాశంగా మార్చడానికి ప్రయత్నించాలని మోదీ సూచించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమకు తాముగా సవాలు చేసుకుంటూ, ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో ముఖ్యం అని మోదీ అన్నారు....

PM Modi Speech (Photo-ANI)

New Delhi, November7: కొవిడ్ -19 అనంతర ప్రపంచంలో టెక్నాలజీ మరియు నూతన ఆవిష్కరణలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. దిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) 51వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన మోదీ, ప్రభుత్వం సంకల్పించిన 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం ఆధారిత భారతదేశం) విజయానికి తోడ్పడాలని కోరారు.

"కొవిడ్ -19 తర్వాత ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది, ఆ ప్రపంచంలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. కొవిడ్ -19 కారణంగా ఈరోజు ఎన్నో విధానాల మార్పులను మనం గమనిస్తున్నాం. వర్చువల్ రియాలిటీ ఇప్పుడు వర్కింగ్ రియాలిటీగా మారుతుంది. గ్లోబలైజేషన్ ముఖ్యమే అయితే, స్వావలంబన, స్వశక్తితో ఎదగడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ దేశం మీరు బిజినెస్ చేయటానికి వీలుగా అన్ని రకాల సౌలభ్యాలు అందివ్వడానికి కట్టుబడి ఉంది, కాబట్టి అందుకు ప్రతిగా మీరు మీ ఆలోచనలు మరియు ఆవిష్కరణల ద్వారా మీ దేశప్రజలకు సౌలభ్యకరమైన జీవనవిధానం అందించటానికి మీ వంతు కృషి చేయాలి" అని మోదీ విద్యార్థులను కోరారు.

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల కోసం కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. "సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతపై భారతీయులకు అపారమైన నమ్మకం ఉంది, ఈ దేశంలో అందరికోసం పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి వాటితో పాటే దేశం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది ఉన్నాయి, దీనికి మీరు పరిష్కారాలు ఇవ్వాలి. విపత్తు నిర్వహణ, భూగర్భజలాలను నిర్వహణ, సౌర విద్యుత్ ఉత్పత్తి, టెలిమెడిసిన్ మరియు బిగ్ డేటా విశ్లేషణ వంటి రంగాలలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి. దేశ అవసరాల కోసం ఇంకా అనేక రకాల ఉదాహరణలను నేను మీ ముందు ఉంచగలను, వాటిపై దృష్టిపెట్టాల్సి ఉంది" అని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కొత్త ఆలోచనలు మరియు నూతన ఆవిష్కరణలతో పరిష్కరించవచ్చు అని మోడీ పేర్కొన్నారు. అందుకే కొత్తగా ఆలోచించండి, దేశ అవసరాలను గుర్తించి ఆత్మనిర్బర్ భారత్‌తో మిమ్మల్ని అనుబంధించాలన్నది నా అభ్యర్థన.” అని ఐఐటీయన్స్ ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

కొవిడ్ కారణంగా నెలకొన్న ప్రతికూలతను ఒక అవకాశంగా మార్చడానికి ప్రయత్నించాలని మోదీ సూచించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమకు తాముగా సవాలు చేసుకుంటూ, ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో ముఖ్యం అని మోదీ అన్నారు. తెలిసింది సరిపోతుందిలే అని ఎప్పుడూ అనుకోవద్దు, తెలియాల్సింది నేర్చుకోవాల్సింది ఎప్పటికీ ఉంటుందని ప్రధాని అన్నారు. పట్టభద్రులు దేశ అభివృద్ధికి నిరంతరం తోడ్పడాలని ప్రధానమంత్రి కోరారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement