Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో తీవ్ర అపశృతి, వీడియోలు ఇవిగో..
తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది.వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలుగా గుర్తించారు. 25 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. రుయాలో వైద్యులు పట్టించుకోకపోవడంతో క్షతగాత్రుల బంధువులు సిమ్స్కు తరలించారు. భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విష్ణు నివాసం, బైరాగి పట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట జరిగింది.
టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూలైన్లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన మల్లిక (Mallika) సహా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Tirupati Stampede Videos
దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కాగా, తొక్కిసలాటలో గాయపడిన మిగిలి వారిని సిమ్స్, రుయాకు తరలించారు. అయితే రుయాలో చికిత్సపొందుతూ మరో ముగ్గురు భక్తులు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.