India Beat Bangladesh by Six Wickets: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ శుభారంభం, 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం, శుభ్‌మన్‌గిల్‌ సెంచరీతో రికార్డుల మోత

Rohit Sharma. (Photo credits: X/@BCCI)

Dubai, FEB 20: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో (ICC Champions Trophy 2025) భార‌త్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో (IND Vs BNG) ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. శుభ్‌మ‌న్ గిల్ (101 నాటౌట్‌; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 46.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (41; 36 బంతుల్లో 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (41 నాటౌట్; 47 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో రిషద్ హొస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు చెరో వికెట్ సాధించారు.

India Beat Bangladesh by Six Wickets

 

ఓ మోస్త‌రు ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌ (Rohit Sharma), శుభ్‌మ‌న్ గిల్‌లు (Shubman Gill) శుభారంభం అందించారు. ఆరంభంలో ఆచి తూచి ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ క్ర‌మంగా జోరు అందుకున్నాడు. బౌండ‌రీతో హోరెత్తించాడు. హాఫ్ సెంచ‌రీకి చేరువైన అత‌డు త‌స్కిన్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు య‌త్నించి రిషద్ హొస్సేన్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. తొలి వికెట్‌కు రోహిత్, గిల్ జోడి 69 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

రోహిత్ ఔట్ అయిన వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కోహ్లీ(22)తో క‌లిసి గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. రెండో వికెట్‌కు 43 ప‌రుగులు జోడించిన అనంత‌రం కోహ్లీని రిషద్ హొస్సేన్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. ఆత‌రువాత వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ (15), అక్ష‌ర్ ప‌టేల్ (8)లు విఫ‌లం అయ్యారు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా మ‌రో ఎండ్‌లో గిల్ పాతుకుని పోయాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి గిల్ భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు. 125 బంతుల్లో గిల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. వ‌న్డేల్లో గిల్‌కు ఇది ఎనిమిదో శ‌త‌కం.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవ‌ర్ల‌లో 228 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో తౌహిద్ హృదయ్ (100; 118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. జాకర్ అలీ (68; 114 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. న‌లుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ ఐదు వికెట్లు తీశాడు. హ‌ర్షిత్ రాణా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్ రెండు వికెట్లు సాధించాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement