Telangana: తెలంగాణలో 1551కి పెరిగిన కోవిడ్-19 కేసులు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఆకస్మిక భేటీ, లాక్‌డౌన్ 4.0 తాజా మార్గదర్శకాలపై చర్చ

సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఈరోజు రాత్రి వరకు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం కంటే ఒకడుగు ముందుంటున్న కేసీఆర్, ఇంతకుముందే తెలంగాణలో లాక్డౌన్ ను మే 29 వరకు విధించారు. మరి ఇప్పుడు కేంద్రం మే31 వరకు విధించిన నేపథ్యంలో అక్కడితో ముగిస్తారా....

Telangana CM KCR | Photo: CMO

Hyderabad, May 18:  ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 4 అమలులోకి వచ్చింది. ఈనెల 31 వరకు ఈ లాక్డౌన్ అమలులో ఉండనుంది. మరికొన్ని ఆంక్షలను సడలిస్తూ కేంద్రం కొత్త లాక్డౌన్ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పనిలోపనిగా రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.  లాక్డౌన్ 4 మార్గదర్శకాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇక రాష్ట్రంలో కరోనా విషయానికి వస్తే, గత 24 గంటల్లో కొత్తగా 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1551కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 37 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 2 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 57మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక ఆదివారం మరో 21 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 992 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. కొత్తగా కరోనా మరణాలేమి సంభవించలేదు, రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 34 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 525 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

 

 

Status of positive cases of #COVID19 in Telangana

 

 

సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది?

 

ప్రస్తుతం హైదరాబాద్ నుంచే కరోనా కేసులు నమోదవుతున్నాయి, జిల్లాల నుంచి కొత్తగా కేసులేమి లేకపోవడంతో ప్రజారవాణాను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం జారీ చేసిన తాజా లాక్డౌన్ మార్గదర్శకాల్లో అంతరాష్ట్ర సర్వీసులకు సైతం అనుమతినిచ్చింది. అయితే తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలలో మాత్రం 25 శాతం సర్వీసులతో ట్రయల్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈరోజు జరిగే కేబినేట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవిపోతే సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఈరోజు రాత్రి వరకు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం కంటే ఒకడుగు ముందుంటున్న కేసీఆర్, ఇంతకుముందే తెలంగాణలో లాక్డౌన్ ను మే 29 వరకు విధించారు. మరి ఇప్పుడు కేంద్రం మే31 వరకు విధించిన నేపథ్యంలో అక్కడితో ముగిస్తారా? లేక అంతకంటే ఎక్కువ పొడగిస్తారా? అనేది వెయిట్ అండ్ సీ!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement