Cough Syrup Export New Rule: ప్రభుత్వ ల్యాబ్లు పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు.. దగ్గు మందులపై డీజీఎఫ్టీ నిబంధనలు
భారత్ లో తయారయ్యే దగ్గు మందులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) నిబంధనలు విధించింది. దగ్గు సిరప్లకు ప్రభుత్వ ల్యాబ్ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్లు సిరప్లను పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు చేసుకోవాలని వివరించింది.
Newdelhi, May 26: భారత్ లో (India) తయారయ్యే దగ్గు మందులపై (Cough Syrup) విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ-DGFT) నిబంధనలు (Rules) విధించింది. దగ్గు సిరప్లకు ప్రభుత్వ ల్యాబ్ల్లో (Govt. Labs) అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్లు సిరప్లను పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు (Exports) చేసుకోవాలని వివరించింది. ఆ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు చూపించాలన్న నిబంధన విధించింది. భారత్లో కొన్ని కంపెనీలు తయారు చేసిన దగ్గుమందుల కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించి, తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. ఆ సిరప్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు అమలు లోకి తెచ్చింది. జూన్ 1 నుంచి ఈ నిబంధనలు అమలు లోకి వస్తాయి.
టెస్టులు ఎక్కడ?
కేంద్ర ప్రభుత్వ పరిధి లోని ఇండియన్ ఫార్మా కోపియా కమిషన్, రీజినల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, ఆర్డీటీఎల్తోపాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోని గుర్తింపు పొందిన ల్యాబ్ల్లో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతి దారులకు సూచించింది.
అసలేం జరిగింది?
2020 లో గాంబియా , ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్లో తయారైన మందు తీసుకోవడం వల్ల అనేక మంది చిన్నపిల్లలు మృతి చెందారు. ఈ మందు కలుషితం కావడం వల్లనే ఇలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత్ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది.