Wayanad Landslide Update: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య.. మట్టి దిబ్బల కింద ఇంకా వందలాది మంది.. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం
కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని విరిగిపడిన కొండచరియల ఘటనలో మృతుల సంఖ్య 20కు చేరింది.
Newdelhi, July 30: కేరళ (Kerala)లోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని విరిగిపడిన కొండచరియల (Landslides Hit Kerala's Wayanad) ఘటనలో మృతుల సంఖ్య 20కు చేరింది. ఇంకా వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకొన్నారు. సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా సహాయ చర్యలకు అంతరాయం కలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పారు. కేరళలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులకు ఓ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల భవనంతో పాటు.. పలు ఇళ్లు బురదలో కూరుకుపోయాయి.'
అసలేం జరిగిందంటే??
సోమవారం అర్థరాత్రి దాటాక ఒంటి గంటకు ఒకసారి, మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్టు స్థానికులు చెప్తున్నారు. దీని ప్రభావం దాదాపు 400 కుటుంబాలపై ఉన్నట్టు అధికారులు తెలిపారు.ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నెంబర్లను సంప్రదించవచ్చునని తెలిపింది.