Oxygen Shortage in Delhi: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం, 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వెంటనే ఢిల్లీకి ఇవ్వాలని ఆదేశాలు, బాత్రా ఆసుపత్రి అత్యవసర పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు
దేశ రాజధానిని ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి వెంటనే 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను (High Court Directs Centre to Supply 490 Metric Tonne Oxygen) ఇచ్చి తీరాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
New Delhi, May 1: దేశ రాజధానిని ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి వెంటనే 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను (High Court Directs Centre to Supply 490 Metric Tonne Oxygen) ఇచ్చి తీరాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ఆధారంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా బాత్రా ఆసుపత్రిలో ఎనిమిది మంది ఆక్సిజన్ లేకపోవడం వల్ల (Oxygen Shortage in Delh) ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక విచారణలో జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖ పల్లి డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది.
కోవిడ్-19 మహమ్మారి (Covid Pandemic) విజృంభిస్తున్న సమయంలో ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ (490 Metric Tonne Oxygen) అవసరమని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం (Delhi Govt) హైకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ సరఫరా చేయడం లేదని తెలిపింది. శుక్రవారం రాత్రి ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆక్సిజన్ సరఫరా కాలేదని తెలిపింది. పరిస్థితి దయనీయంగా ఉందని వివరించింది.
ఈ నేపథ్యంలో బాత్రా ఆసుపత్రి (Batra Hospital) దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శనివారం ప్రత్యేక విచారణ జరిపింది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఓ డాక్టర్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని బాత్రా ఆసుపత్రి హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఢిల్లీకి సరఫరా చేయాలని, లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీ రాష్ట్రం కోసం ఉద్దేశించిన నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లను రాజస్థాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వీటిని విడిపించి, ఢిల్లీ రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.
దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు కరోనా పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఢిల్లీ ఆసుపత్రులలో కరోనా పరిస్థితులు, బెడ్లు, ఆక్సిజన్ కొరతకు సంబంధించి పలు ఆసుపత్రులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విపిన్ సంఘి, రేఖ పల్లితో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. కొన్ని పెద్ద ఆసుపత్రులు ఖర్చుల పేరుతో ఎంతో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది.
ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించింది. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని వీటిని వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. బెడ్ల కొరత నేపథ్యంలో రోగులను బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆసుపత్రులలో చోటుచేసుకున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్లపైనా ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.
ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఎంత మంది రోగులు అడ్మిట్ అయ్యారు, ఎంత మందిని డిశ్చార్జ్ చేశారు, ఇంకా ఎంత మంది చికిత్స పొందుతున్నారు అన్న వివరాలను సమర్పించాలని ఢిల్లీ ఆసుపత్రులను కోర్టు ఆదేశించింది. ఆసుపత్రుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పడకలను ఖాళీ చేయడం లేదని వస్తున్న ఆరోపణలపై సమీక్షించేందుకు ఈ సమాచారాన్ని సమర్పించాలని కోరింది.