UP Horror: అంబులెన్స్ లేక తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త.. యూపీలో ఘోరం
ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం కాలేదు.
Lucknow, Dec 20: ఉత్తర్ ప్రదేశ్ (Uttarpradesh) ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో (Govt. Hospital) దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో (Heart Attack) మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం కాలేదు. దాంతో ఆమె భర్త తోపుడుబండిపై మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ఎటా జిల్లాలోని అస్రౌలి గ్రామానికి చెందిన వేద్ రామ్ భార్య మోహర్ కు సోమవారం గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని ట్రామా కేంద్రంలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సు కావాలని ఆమె భర్త కోరాడు. గంటల కొద్ది వేచి ఉన్నా ఎవరూ తన గోడు వినిపించుకోకపోవడంతో చివరకు తోపుడుబండిపై ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వార్తా వైరల్ గా మారింది.