AP Cabinet Meet Highlights: అమరావతిపై సస్పెన్స్ కొనసాగింపు, ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తే, వేరే నగరాలతో ఎన్నటికి పోటీపడగలమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్య, చంద్రబాబు హయాంలోని అవినీతిపై విచారణ, కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు

గత ప్రభుత్వం ఊహిజనిత రాజధాని నిర్మాణంపై భ్రమింపజేసింది. రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి, మరో 21 వేల ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం కోసం 1లక్షా పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ...

AP Cabinet Meet Highlights | (Photo-Twitter)

Amaravathi, December 27: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో తీవ్రస్థాయి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం భేటి అయిన రాష్ట్ర మంత్రివర్గం, 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి తమ సమావేశాన్ని ముగించింది. అయితే ఈ సమావేశం తర్వాత అమరావతిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనే విషయంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు. కానీ, ప్రభుత్వం మాత్రం రాజధాని సస్పెన్స్ ను మరికొంత కాలం పొడగించింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై సమగ్రంగా చర్చించిన కేబినేట్, బీసీజీ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ రెండు కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు మరో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ భేటీ అనంతరం సమాచార మంత్రి పేర్ని నాని, సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. హైపవర్ కమిటీ సూచనల మేరకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుంది. ఇప్పటికీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి మాటలను బట్టి చూస్తే ప్రస్తుతానికి అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తలను తగ్గించే ప్రయత్నం చేసినట్లుగా అర్థం అవుతుంది. జనవరిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సమావేశాల ద్వారా రాజధాని భూముల విషయంలో గత ప్రభుత్వం పాల్పడిన అవకతవకలను ప్రజలకు విప్పిజెప్పే ప్రయత్నం చేయాలని సీఎం జగన్ ఆలోచన అన్నట్లుగా మంత్రి పేర్ని నాని మాటలను బట్టి అర్థం అవుతుంది.

చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ, మంత్రి వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి

 

  • రాజధాని ప్రకటనకు ముందే మాజీ సీఎం చంద్రబాబు వాటాలు కలిగి ఉన్న కంపెనీలు, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి న్యాయ సలహా తీసుకొని లోకాయుక్త, సిబిఐ లేదా సిఐడితో విచారణకు సిఫారసు.
  • రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందవద్దు, రైతుల పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.
  • గత ప్రభుత్వం ఊహిజనిత రాజధాని నిర్మాణంపై భ్రమింపజేసింది. రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి, మరో 21 వేల ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం కోసం 1లక్షా పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. లక్ష కోట్ల పెట్టుబడులు తేవాలంటే ఎంతకాలం పడుతుందో ప్రజలు అంచనా వేసుకోవాలి.
  • పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ నీటి ప్రాజెక్టులకు మరో రూ. లక్ష కోట్ల నిధుల అవసరం ఉంది.
  • ఆసుపత్రుల అభివృద్ధికి రూ. 14 వేల కోట్లు, పాఠశాల అభివృద్ధికి రూ. 12 వేల కోట్లు, అమ్మఒడి పథకానికి రూ. 6 వేల కోట్లు అవసరం.

    ప్రతీ పథకం అమలుకు నిధులు కావాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అవసరాలు, భవిష్యత్తు, అభివృద్ధి చూడాలా? ఇవన్నీ పక్కనపెట్టి రాజధాని నిర్మాణం చేపడితే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలతో ఎంతకాలానికి పోటీపడగలం?

  • రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేయలేదు, పరిపాలన వికేంద్రీకరణపై మాట్లాడుతూ ఏదీ ఎక్కడ ఉంటుందో మాత్రమే చెప్పారు. హైపవర్ కమిటీ సూచనల మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది.

ఇక వీటితో పాటు స్టేట్ కేబినేట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం. ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం ఎస్టీలకు 4 శాతం, ఎస్సీలకు 08 శాతం, బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కేటాయింపు.
  • పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాల వంటి పంటలకు మద్దతు ధరలను ముందే ప్రకటింపు. ప్రభుత్వం నుంచి నేరుగా కొనాలని కేబినెట్‌ నిర్ణయించింది.
  • 412 కొత్త 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలు కోసం రూ. 71 కోట్లు కేటాయింపు, 104 వాహనాల కోసం అదనంగా రూ. 60 కోట్లు కేటాయింపు.
  • మచిలీపట్నం ఓడరేవు నిర్మాణాన్ని డిపిఆర్‌ సంస్థకు అప్పగింత, రామాయపట్నం ఓడరేవు నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement