MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..? (లైవ్)
ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.
Hyderabad, Mar 3: ఏపీ (AP), తెలంగాణలో (Telangana) ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై (MLC Election Counting) అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది. నల్లగొండలో వరంగల్- ఖమ్మం- నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఏపీలోనూ ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఈఈఈ బిల్డింగ్ లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది.
మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
LIVE:
ఫలితాలు ఆలస్యం
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెంటనే వెలువడవు. కారణం ఇవి బ్యాలెట్ బాక్సులు కావడం వల్లే. మూడు అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే.. ఫలితం మరింత ఆలస్యం అంటే మూడు రోజులు కావొచ్చు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే.. సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఇతర ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్క్ ను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికైతే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఇలా కింద నుంచి పై వరకు ఇదే తరహాలో లెక్కించి, ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వెళతారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మెజార్టీ ఓట్ల మార్కుకు ఏ అభ్యర్థి చేరకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఆ అభ్యర్థులకు ఖాతాలో వేస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే నాలుగో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు. ఇలా మెజారిటీ మార్కు సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరేవరకు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకం అవుతాయి. ఫలితాలు కూడా అందుకనే ఆలస్యంగా వెలువడతాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)