Rains Alert In Telugu States: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఓవైపు ఎండలు.. మరోవైపు వానలతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
Hyderabad, March 27: ఓవైపు ఎండలు.. మరోవైపు వానలతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో (Telangana) రెండు, మూడు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ (Warangal), నల్లగొండ (Nalgonda), ఖమ్మం (Khammam) జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలోనూ..
అటు ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే చాన్స్ ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అకాల వర్షాలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు ఈ వార్త షాక్కు గురిచేసింది.