School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన
గతంలో గుండెపోటు అంటే 60-70 ఏండ్లు దాటిన వారికి అదీ ఊబకాయంతో బాధపడే వారికి వచ్చేది. అయితే, ఇప్పుడు యువతీయువకులతో పాటు స్కూల్ పిల్లలకు కూడా గుండెపోటు రావడంతో పాటు కొన్ని మరణాలు కూడా సంభవించడం నిత్యకృత్యంగా మారింది.
Kamareddy, Feb 21: గతంలో గుండెపోటు (Heart Attack) అంటే 60-70 ఏండ్లు దాటిన వారికి అదీ ఊబకాయంతో బాధపడే వారికి వచ్చేది. అయితే, ఇప్పుడు యువతీయువకులతో పాటు స్కూల్ పిల్లలకు కూడా గుండెపోటు రావడంతో పాటు కొన్ని మరణాలు కూడా సంభవించడం నిత్యకృత్యంగా మారింది. కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక కాలి నడకన పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కామారెడ్డిలోని కల్కినగర్ లో తన పెదనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
నడుస్తూ వెళ్తుండగా..
గురువారం ఉదయం టిఫిన్ తినకుండా బాక్సు కట్టుకొని పాఠశాలకు బయలుదేరింది శ్రీనిధి. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో స్కూలు సమీపంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే శ్రీనిధి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శ్రీనిధి కుటుంబంలో విషాదం నెలకొంది.