Jagan Slams TDP-led Govt: అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Tadepalli, Nov 7: ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైఎస్సార్సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ప్రశ్నించే స్వరం ఉండకూడదని.. అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. డీజీపీపై, కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న పోలీస్ అధికారులకు హితబోధ చేశారు. పోలీసులు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు. ఇల్లీగల్గా అరెస్టులు చేయడమేంటి?. రాజకీయ నాయకులు చెప్తున్నారని.. తప్పు చేస్తూ పోతే బాధితుల ఉసురు తగులుతుంది. పోలీసులు ఇప్పటికైనా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మీరు చేసే పనుల వల్ల పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోందని ఫైర్ అయ్యారు.
YS Jagan Press Meet
పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్సైడెడ్గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తాం. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుకు న్యాయసహాయం అందిస్తుంది. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో.
ట్రాన్స్ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్బుక్లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
అఘాయిత్యాలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. కరెంట్ ఛార్జీలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. వరద సాయంపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ఉచిత ఇసుకపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని అన్నందుకు.. తప్పుడు కేసు. అసలు జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు?.
‘‘విద్య వద్దు.. మద్యం ముద్దు. నాన్నకు పుల్లు.. అమ్మకు నిల్లు’’ అని పోస్ట్ చేసినందుకు ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ‘‘జనసేన నేతలతో బలవంతంగా కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు’’ అనే కథనాన్ని ఫార్వర్డ్ చేసిందుకు ఓ వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టారు. అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కోసం ప్రజాధనం కాజేశారని పోస్ట్ చేసినందుకు ఓ యువకుడ్ని అరెస్ట్ చేశారు.
తిరుమలలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో.. తలపై వస్త్రాలు పక్కకు వంగిపోయాయి. ఈ జరిగిన పరిణామాన్ని పోస్ట్ చేసి.. ‘‘తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్యపు ప్రచారం చేసినందుకు దేవుడికి కూడా చంద్రబాబు నచ్చడంలేదని ఓ యవకుడు షార్ట్ రీల్ చేశాడు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు.
వీళ్లంతా సోషల్ మీడియా యాక్టివిస్టులు. పైగా యంగ్స్టర్స్. రాష్ట్రంలో జరుగుతున్నవే కదా పోస్ట్ చేస్తున్నది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి రెండు మూడు రోజులు ఉంచి చిత్రహింసలు పెడుతున్నారు. అవన్నీ వాస్తవాలే కదా. జరుగుతున్నవే కదా.
ఏడేళ్లలోపు కేసుల్లో ప్రొసీజర్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే.. వారెంట్ ఇవ్వాలి. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదు అని జగన్ అన్నారు.
టీడీపీ అధికారిక వెబ్సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్సైట్లోనే జరిగింది. మరి నారా లోకేష్ను ఎందుకు అరెస్టు చేయలేదు?.
ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)