Population Control Law : మరో సంచలన బిల్లు తెచ్చేందుకు మోదీ సర్కారు సిద్ధం, జనాభా నియంత్రణ కోసం బిల్లు తెస్తామని కేంద్రమంత్రి ప్రకటన, జనాభా నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు
మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు విప్లవాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం...తాజాగా జనాభా నియంత్రణ (Population Control) కోసం చట్టం తీసుకురాబోతోంది. ఈ మేరకు స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) స్ఫష్టత ఇచ్చారు.
New Delhi, June 02: మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు విప్లవాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం...తాజాగా జనాభా నియంత్రణ (Population Control) కోసం చట్టం తీసుకురాబోతోంది. ఈ మేరకు స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) స్ఫష్టత ఇచ్చారు. ఛత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా జనాభా నియంత్రణ చట్టం గురించి స్పందించారు. త్వరలోనే జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టం రాబోతుందని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.
జనాభా నియంత్రణ బిల్లు గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2019లో జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన ముసాయిదా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కూడా ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును 2020లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం ఈ బిల్లులు రాజ్యసభ పరిశీలనలోనే ఉన్నాయి. అయితే, తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో జనాభా నియంత్రణ చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టబోతున్నట్లు స్పష్టమైంది.