Puducherry: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. అసెంబ్లీ తీర్మానానికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంగీకారం
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry)కి రాష్ట్ర హోదా కావాలంటూ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి (Chief Minister N. Rangaswamy) అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ (Lt. Governor Tamilisai Soundararajan) ఆమోదించారు.
Puducherry, Aug 6: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry)కి రాష్ట్ర హోదా కావాలంటూ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి (Chief Minister N. Rangaswamy) అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ (Lt. Governor Tamilisai Soundararajan) ఆమోదించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ సుదీర్ఘ కాలంగా రేగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై 13సార్లు అసెంబ్లీలో తీర్మానాలు నెరవేర్చాక, గవర్నర్ ఆమోదించినా కేంద్రప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ప్రతిసారీ రాష్ట్ర హోదా కోరుతూ పుదుచ్చేరిలో పలు రాజకీయ పార్టీలు, వ్యాపారులు రకరకాల ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రంగస్వామి.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లేనందున తనకు ఎలాంటి అధికారాలు లేకుండాపోయాయని ఏకరువు పెట్టారు. ఈ నేపథ్యంలో గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అఖిలపక్షం అనుమతితో ముఖ్యమంత్రి రంగస్వామి రాష్ట్ర హోదా కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని తాజాగా పరిశీలించిన గవర్నర్ తమిళిసై.. ఎట్టకేలకు ఆమోద ముద్ర వేశారు.