Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు.
Hyderabad, Jan 10: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వైకుంఠ ఏకాదశి వేడుకలు (Vaikunta Ekadasi 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు. తిరుమలలో గోవింద నామస్మరణ మారుమోగిపోతున్నది. రద్దీ అంతకంతకూ పెరిగిపోతున్నది. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అటు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
ఈ రోజు విశిష్టత ఏంటంటే?
పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. ఆలయాలకు వీఐపీల తాకిడి కూడా నెలకొంది.