Liquor Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!
తెలుగు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు మందుబాబులకు పెద్ద షాకిచ్చాయి. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఆయా సర్కారులు నిర్ణయం తీసుకున్నాయి.
Hyderabad, Feb 11: తెలుగు రాష్ట్రాలలోని (Telugu States) రెండు ప్రభుత్వాలు మందుబాబులకు పెద్ద షాకిచ్చాయి. మద్యం ధరలను (Liquor Prices Hike) 15 శాతం పెంచుతూ ఆయా సర్కారులు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. జైస్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. బీర్ల ధరలు సవరించాలని యునైటెడ్ బేవరేజస్, మరికొన్ని బేవరేజస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరలు సవరించాలని బేవరేజస్ కంపెనీలు కోరుతున్న డిమాండ్లను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ ముందు ఉంచారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో బేవరేజస్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి వారితో ఇంతకు ముందే తేల్చి చెప్పారు. ఈ అంశంపై ఒక కమిటీ వేశారు. ఆ ప్రైస్ ఫిక్సింగ్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ల ధరలను 15 శాతం పెంపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఇలా..
అటు ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలపై 15 శాతం పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రూ.99కి అమ్మే మద్యం బ్రాండ్లు, బీర్లకు ఈ ధర పెంపు వర్తించదు. మిగతా అన్ని రకాల మద్యంపై... పెంచిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.