Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
పెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు.
Mumbai, March 07: పెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు. ఈ సంవత్సరం బంగారం ధరలు ఇప్పటికే 12% పైగా పెరిగి, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా రికార్డులను సృష్టిస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాల రుణం $76 ట్రిలియన్ల వద్ద కొనసాగుతోంది. దీనికి మరో $13 ట్రిలియన్లు జమ కాబోతుంది.
అధిక పన్నులు, ద్రవ్యోల్బణం వల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీని ప్రభావంతో రుణాలు పొందడం చాలా కష్టతరమవుతుంది. ఈ పరిస్థితిలో, బంగారం స్థిరమైన పెట్టుబడిగా మారడమే కాకుండా ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనే ఆస్తిగా ఉంటుంది. దీంతో బంగారానికి ప్రత్యామ్నాయంగా మరో మంచి పెట్టుబడి ఆప్షన్ లేదని అన్నారు. కాబట్టి పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయని డేవిడ్ టైట్ చెప్పారు.
భారతదేశం, చైనా, జపాన్ దేశాలలో గోల్డ్ ఈటీఎఫ్లు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక లేదా పెట్టుబడి సంబంధిత సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, అలాగే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటివరకు బంగారాన్ని పెట్టుబడిగా పరిగణించలేదని ‘డేవిడ్ టైట్’ పేర్కొన్నారు.
జపాన్లో పెద్దల నుండి సంపదను వారసత్వంగా పొందుతున్న యువతకు ఆర్థిక పరంగా మరింత అవగాహన ఉంటుంది. దీని వల్ల భవిష్యత్తులో బంగారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
చైనాలో తాజాగా బీమా సంస్థలకు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టే అనుమతి లభించిందని డేవిడ్ టైట్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ పెట్టుబడులు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. ఒకవేళ పెరిగితే మాత్రం బంగారం ధరలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వద్ద బంగారం నిల్వలు తక్కువగానే ఉన్నాయని, ఇప్పుడున్న ఆర్థిక, భౌగోళిక అనిశ్చితి మధ్య ఇంకా ఎక్కువగా.. వ్యక్తిగత పెట్టుబడిదారుల మాదిరిగానే తమ నిల్వలను పెంచుకోవడానికి దేశాలు వెనకడుగు వెయ్యబోవని టైట్ చెప్పారు.
భారతదేశంలో యువత జనాభా ఎక్కువగా ఉండటం వల్ల బంగారాన్ని పెట్టుబడిగా, ఆభరణాలుగా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువని డేవిడ్ టైట్ వివరించారు.
(The above story first appeared on LatestLY on Mar 07, 2025 09:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

