KTR Letter to Nirmala: తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మొద్దు, ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయండి, ఉపసంహరణ పేరుతో అడ్డికి పావుశేరు అమ్ముతున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపాటు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలు చేయని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని దుయ్యబట్టారు.
Hyderabad, June 19: దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను (PSU) బీజేపీ (BJP) ప్రభుత్వం ‘అడ్డికి పావుశేరు’ చొప్పున అమ్ముతుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలు చేయని మోదీ (MODI) ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్కు (Nirmala Sitaraman) కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే యోచనను విరమించుకోవాలని కోరారు.
హిందుస్థాన్ కేబుల్స్ (Hindusthan Cables), హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ (Hindusthan floro corbons), ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా అమ్ముతోంది. ఈ ఆరు సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాదాపు 7,200 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి విలువ కనీసం ₹5 వేల కోట్లపైగా, బహిరంగ మార్కెట్లో ₹40 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా.
ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లేఖలో కోరారు. మరోవైపు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మే ప్రయత్నాలపై పునరాలోచన చేయాలని సూచించారు.