SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Hyderabad, Feb 24: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు (SLBC Tunnel Rescue Operation) ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. ఈ క్రమంలో ఎస్ఎల్బీసీ(SLBC Tunnel) సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Miners)ను రంగంలోకి దింపింది. 2023లో ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ సిల్క్ యారా సొరంగంలో చిక్కుకున్న 41 మందిని వీళ్లే రక్షించారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్ చేరుకున్నారు. కాగా శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) టన్నెల్ నిర్మాణ పనుల్లో కొంతభాగం పైకప్పు కూలి 8 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఎవరీ ర్యాట్ హోల్ మైనర్స్ ?
ఎలుకల మాదిరి ర్యాట్ హోల్ టెక్నిక్ లో ఒకే ఒక్క మనిషి పట్టేంత వెడల్పుతో సొరంగాన్ని తవ్వుతారు. సులభమైన పనిముట్లతో ఒకరు మట్టిని తవ్వుతుంటే, వెనుక ఉన్న వ్యక్తి ఆ మట్టిని బయటకు పంపిస్తారు. అలా పైకప్పు కూలకుండా చిన్నచిన్నగా సొరంగాన్ని తవ్వుతూ లోపలికి వెళ్తారు. వీళ్లను ర్యాట్ హోల్ మైనర్స్ అంటారు.
సొరంగంలో చిక్కుకున్న వారు వీరే
శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సొరంగంలో చిక్కుకున్న వారు వీరే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్ కు చెందిన సంతోష్ సాహు, అనూజ్ సాహు, సందీప్ సాహూ, జక్తా ఎక్సెస్, జమ్మూకాశ్మీర్ కు చెందిన సన్నీసింగ్, పంజాబ్ కు చెందిన సన్నీసింగ్ ఉన్నట్లుగా తెలిపారు.