Telangana Assembly Session 2023: తెలంగాణ అప్పు రూ. 6,71,757 కోట్లు, అసెంబ్లీలో 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (Economic situation of state) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly Session 2023) శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్ను సభలో ప్రవేశపెట్టారు.
Hyd, Dec 20: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (Economic situation of state) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly Session 2023) శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి (Deputy CM Bhatti Vikramarka) చెప్పారు.
ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నాను. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు’’ అని భట్టి అన్నారు.
శ్వేతపత్రం బుక్ విడుదలపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్రావు అభ్యంతరం చెప్పారు. అరగంట ముందు బుక్ రిలీజ్ చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని అడిగారు.ఇదే రీతిలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీనణ్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ అరగంట పాటు అసెంబ్లీని వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు.
అరగంట ముందు 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించడాన్ని లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి శ్రీధర్బాబు సమర్థించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందన్నారు. తాము కొత్తగా చేసిందేమీ లేదన్నారు. శ్వేతపత్రంపై సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
అంతకుముందు సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..
రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.
2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.
2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
బడ్జెట్కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
రోజూ వేస్ అండ్ మీన్స్పై ఆధారపడాల్సిన దుస్థితి
2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.
బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ