Heavy Rain Alert: మరో రెండు రోజులు..భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ,అధికారులు అప్రమత్తం
తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ వర్షాలు ఇప్పట్లో పోయేలా లేవు. తాజాగా రాష్ట్రానికి భారీ వర్షసూచన (Heavy Rain Alert) ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Amaravati,Oct 20: తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ వర్షాలు ఇప్పట్లో పోయేలా లేవు. తాజాగా రాష్ట్రానికి భారీ వర్షసూచన (Heavy Rain Alert) ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలో మంగళవారం వేకువ జాము నుంచి వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వానపడగా.. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మారేడ్పల్లి, బోయినపల్లి, అల్వాల్, తిరుమలగిరి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ, ఫలక్నుమా, చాంద్రయాణగుట్ట, ఉప్పుగూడ, జహనుమా తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది. సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, చిలుకలగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలను మేయర్ బొంతు రామ్మోహన్ అప్రమత్తం చేశారు.
జీహెచ్ఎంసీ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గత వారం రోజుల్లో రెండు సార్లు కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు పొంగి ప్రవహిస్తోంది. నలాలు ఉప్పొంగుతున్నాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వరద నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా క్లోరినేషన్ పనులు చేపడుతున్నారు. బ్లీచింగ్ చల్లడంతో పాటు రసాయనాలను పిచికారీ చేయిస్తున్నారు.
రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సముద్రంలో పెరగనున్న అలలు ఉధృతి, సముద్ర తీరం వెంట 45 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 5 సెం.మీ., కూనవరం, నర్సీపట్నం, బెస్తవానిపేట, చోడవరం, కుంభం, కొమరాడల్లో 3 సెం.మీ. వంతున, సత్యవేడు, సీతానగరం, సూళ్లూరుపేట, ఇచ్ఛాపురం, వరరామచంద్రాపురం, సాలూరు, యర్రగొండపాలెం, చింతపల్లిల్లో 2 సెం.మీ. వంతున వర్షపాతం నమోదైంది.
రాగల నాలుగైదు గంటల్లో ఏపీలో. విశాఖ, ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే నివాసముండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.