Coronavirus in India: దేశంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్న కేసులు, తాజాగా 46,759 మందికి కరోనా, నిన్న రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి మందికి పైగా వ్యాక్సినేషన్
దేశంలో 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు (Coronavirus in India) పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది.
New Delhi, August 28: దేశంలో 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు (Coronavirus in India) పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది. ఇందులో 3,18,51,802 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,37,370 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 3,59,775 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 509 మంది ( 509 Deaths in Past 24 Hours) మరణించగా, మరో 46,759 మంది బాధితులు కోలుకున్నారని వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపింది. దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి డోసులకు పైగా వ్యాక్సినేషన్లు జరిగినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62,17,06,882కు చేరుకుంది. కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్క రోజులోనే 1,00,64,032 డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. కోటి డోసులు దాటడం గుర్తుండిపోదగ్గ సందర్భమని ప్రధాని మోదీ అన్నారు.
వ్యాక్సినేషన్లు తీసుకొని డ్రైవ్ను విజయవంతం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ నెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకూ ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలుకొట్టింది. 18–44 వయసుల వారిలో 30,85,06,160 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా, 23,98,99,849 మంది రెండు డోసులను తీసుకున్నారు.ఇప్పటివరకు మొత్తం 62,29,89,134 డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.