Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)
ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది.
Vijayawada, Feb 25: ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం (Elephant Attack) సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురు చేశాయి. ఏనుగుల దాడిలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గజరాజులు దాడి చేస్తున్న సమయంలో మిల్లులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. కాగా నెల రోజుల్లో ఇదే మిల్లుపై గజరాజులు రెండు సార్లు దాడులకు పాల్పడటం గమనార్హం.
మరో ఘటనలో ఇలా..
అన్నమయ్య జిల్లాలో మంగళవారం ఉదయం మరో ఏనుగుల గుంపు (Elephant Attack) బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వై. కోటకు చెందిన కొందరు భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగుల గుంపు దాడికి పాల్పడినట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు.
బాధితులు వీళ్లే..
ఏనుగుల గుంపు దాడి బాధితులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానికులు దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మొన్న కూడా..
నెలరోజుల కిందట కూడా తిరుపతి జిల్లాలో కూడా ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడికి పాల్పడింది. చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలో ఈ ఘోరం జరిగింది. ఏనుగుల గుంపును తరిమేందుకు వెళ్లిన రైతులపై ఏనుగులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉపసర్పంచ్ రాకేశ్ ను ఏనుగులు తొక్కిచంపాయి.