Lockdown in TS: తెలంగాణలో నేటి నుంచి పగటి లాక్డౌన్ ఎత్తివేత, పెరగనున్న ప్రజా రవాణా మరియు కార్యాలయాల పనివేళలు; రాష్ట్రంలో ప్రస్తుతం 24,301గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

ఈరోజు నుంచి పగలంతా కూడా ఆర్టీసీ బస్సులను నడుపుతామని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు సాయంత్రం వరకు తిరగనున్నాయి, నేటి నుంచి విద్యార్థులకు బస్ పాసుల జారీ కూడా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు....

Coronavirus Outbreak| (Photo Credits: IANS)

Hyderabad, June 10: తెలంగాణలో ఈరోజు నుంచి పగటిపూట లాక్‌డౌన్‌ ఎత్తివేయబడుతుంది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్‌డౌన్‌ సడలింపులు కొనసాగుతాయి. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి పగలంతా కూడా ఆర్టీసీ బస్సులను నడుపుతామని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు సాయంత్రం వరకు తిరగనున్నాయి, నేటి నుంచి విద్యార్థులకు బస్ పాసుల జారీ కూడా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు మెట్రో సర్వీసులు కూడా సాయంత్రం 7 నుంచి సాయంత్రం 6 వరకు నడవనున్నాయి, కాగా ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే ఇతర రాష్ట్రాల సర్వీసులపై మరియు ప్రయాణాలపై నిషేధం కొనసాగనుంది.

ఇక, లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు కూడా పెరగనున్నాయి, అటు ప్రైవేట్ కార్యాలయాలు కూడా తగిన సిబ్బందితో కోవిడ్ నిబంధనల మేరకు సాయంత్రం వరకు పనిచేసేందుకు వెసులుబాటు కల్పించారు.

అయితే లాక్డౌన్ సడలింపులు కల్పించినప్పటికీ, ఎప్పట్లాగే అన్నిరకాల సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. వివాహానికి 40 మంది, అంత్యక్రియలకు 20 మంది పరిమితి కొనసాగుతుంది. సినిమా హాళ్లు, పార్కులు, క్లబ్బులు, పబ్బులు పూర్తిగా మూసే ఉంటాయి.

ఇక, రాష్ట్రంలోని కేసులను పరిశీలిస్తే, తెలంగాణలో బుధవారం 1813 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కోవిడ్ బారి నుంచి మరో 1802 కోలుకున్నారు. అలాగే కరోనాతో పోరాడి 17 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement