Morocco Earthquake: ఎటు చూసినా శవాలే, మొరాకోలో 2,000కు చేరిన మృతుల సంఖ్య, మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించిన కింగ్‌ మహమ్మద్‌-6

ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను (Morocco) భారీ భూకంపం (Earthquake) అతలాకుతలం చేసింది. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు (Marrakesh) 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.

Morocco Earthquake (Photo Credit: ANI)

Rabat, September 10: ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను (Morocco) భారీ భూకంపం (Earthquake) అతలాకుతలం చేసింది. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు (Marrakesh) 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతిచెందారు. మరో 2,059 మంది గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫ్రెంచివాసిని తాజాగా గుర్తించారు.

భూకంపం ధాటికి భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దేశంలో గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని అధికారులు తెలిపారు. మరకేష్‌-సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలు అధికంగా ఉన్నాయి. దాదాపు భూకంపం తాకిడికి 45 లక్షల మంది ప్రభావితులయ్యారు. శిథిలాల కింది చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. పన్నెండో శతాబ్దంనాటి కౌటౌబియా మసీదు దెబ్బతింది. మరకేష్‌ పాత నగరంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రెడ్‌ వాల్స్‌ కూడా దెబ్బతిన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు చాలా అరుదు అని అధికారులు చెప్పారు. ఈ పర్వత ప్రాంతంలో నమోదైన భూకంపాల్లో ఇది చాలా తీవ్రమైనదని తెలిపారు. అగడిర్‌ పట్టణంలో 1960లో సంభవించిన భూకంపం తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైందని, అప్పట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీంతో మొరాకోలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు జరిగాయన్నారు.

మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం

రెండు దశాబ్దాల క్రితం మొరాకోతో సంబంధాలు తెంచుకున్న పొరుగు దేశం అల్జీరియా (Algeria) కూడా విపత్తు వేళ సహయం చేయడానికి సిద్ధమైంది. తన మిలటరీని సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పంపించింది.

మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్‌ మహమ్మద్‌-6 నిర్ణయం తీసుకొన్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు.

మారకేష్‌ ఎయిర్‌ పోర్టు ప్రయాణికులతో నిండిపోయింది. దేశాన్ని వీడి వెళ్లే యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. వారంతా నేలపైనే పడుకొన్నారు. విమాన ప్రయాణాల్లో ఎటువంటి మార్పులు లేవు. మరోవైపు ప్రజలకు సాయం చేసేందుకు మొరాకో సాకర్‌ జట్టు ముందుకొచ్చింది. ఈ జట్టు సభ్యులు క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement