MP Honey Trapping Case: బడా బాబుల నీలి స్కాం, వెలుగులోకి కొత్త విషయాలు, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న లిప్ స్టిక్, కళ్లద్దాల గేమ్, దేశంలో అతి పెద్ద సెక్స్ కుంభకోణం ఇదే, సూత్రధారులు, పాత్రధారులపై రహస్య నిఘా పెట్టిన సిట్, కేసును వదిలే ప్రస్తకే లేదంటున్న కమలనాధ్ ప్రభుత్వం
మధ్యప్రదేశ్లో బయటకు వచ్చిన సెక్స్ కుంభకోణం కేసు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తోందనని రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు హడలిపోతున్నారు.
Bhopal,Septemebr 30: మధ్యప్రదేశ్లో బయటకు వచ్చిన సెక్స్ కుంభకోణం కేసు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తోందనని రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు హడలిపోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం, మాజీ గవర్నర్, 8 మంది మాజీ మంత్రులు, 13 మంది బ్యూరోక్రాట్లు చిక్కుకున్నారు. అయితే ఈ వ్యవహారం కేవలం మధ్యప్రదేశ్కే పరిమితం కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. దేశంలోనే ఇదే అతిపెద్ద సెక్స్ కుంభకోణమని, రాజకీయ నాయకులు, అధికారులతోపాటు జర్నలిస్టులకూ ఇందులో పాత్ర ఉందని కేసును చేధిస్తున్న పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు అభ్యంతకర రీతిలో ఉన్నప్పుడు చిత్రీకరించిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్పింగ్స్ పోలీసుల చేతికి చిక్కాయి. అలాగే, వీరితో చాటింగ్ చేసిన మెసేజ్లు, ఆడియో క్లిప్పులు, వీడియో క్లిప్పింగ్కు సంబంధించి దాదాపు 4000 ఫైల్స్ నిందితుల వద్ద లభించాయి.
నిందితుల వద్ద 4000 ఫైల్స్
ఇదిలా ఉంటే ఈ స్కాంలో ఇప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. లిప్స్టిక్ల్లో, కళ్లద్దాల్లో రహస్యంగా దాచిన కెమెరాల ద్వారా రాసలీలలను చిత్రీకరించారనే షాకింగ్ విషయాన్ని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పదుల సంఖ్యలో స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒకరు యువతితో హోటల్ గదిలో చేస్తున్న రాసలీలల వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది, దీంతో పాటుగా ఓ హిందుత్వ సంస్థకు చెందిన నాయకుడికి సన్నిహితుడైన ఓ పెద్దాయనకు సంబంధించిన మరో వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. అయితే, అవి నిజమైనవా? కావా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే ఈ స్కామ్కు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా, అవి చాలావరకు నకిలీవని తెలుస్తోంది.
ఈ స్కాంలో ఇరుక్కున్న ఓ సీనియర్ ఇంజనీర్ ఫిర్యాదు ద్వారా ఈ భారీ స్కాం బయటకు వచ్చిన సంగతి విదితమే. రూ.3 కోట్లు ఇవ్వాలని లేదంటే అశ్లీల వీడియోను బయటపెడతామని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు బయటకు వచ్చింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పడక గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీయడం కోసం ఈ ముఠా లిప్స్టిక్, కళ్లద్దాల్లో కెమెరాలను పెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా వీడియోలు తీయడం కోసం నిందితులు ఇలా చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులోని నిందితుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ మంత్రుల శృంగారాలున్న వీడియో, ఆడియో క్లిప్లను వేలాదిగా సిట్ స్వాధీనం చేసుకుంది.
మీడియాతో మధ్య ప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్
ఈ ముఠా జాబితాలో అగ్రికల్చర్, ఫిషరీస్, కల్చర్, ఇండస్ట్రీస్, పట్టణాభివృద్ధి, లేబర్, అటవీ, జలవనరులు, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో పనిచేసి వివిధ అధికారులు ఉన్నారు. వీరి పేర్లకు బదులుగా నిక్ నేమ్స్, కోడ్లు మార్క్ చేశారు. టార్గెట్ లిస్ట్లో ఉన్న అధికారులు ఎవరో గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సెక్స్ రాకెట్ కేసులో తమ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తుంది. కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ప్రభుత్వం మాత్రం హనీ ట్రాప్ కేసులో పాలుపంచుకున్న వారినందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది.
Special DG Purushottam Sharma
కాగా శ్వేతా జైన్ అనే మహిళ ఈ దందాను నడిపేదని, స్వచ్ఛంద సంస్థ ముసుగులో కాలేజీకెళ్లే అమ్మాయిలను ప్రలోభపెట్టి ఈ కార్యకలాపాలు కొనసాగించేదని పోలీసులు చెబుతున్నారు. ధనికులు, రాజకీయ నాయకుల దగ్గరకు అమ్మాయిలను పంపి వారు యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్పై కెమెరా ద్వారా రహస్యంగా వీడియో తీసేవారు. అనంతరం వారికి వీడియో క్లిప్పింగ్లను పంపి భారీగా డబ్బులు డిమాండ్ చేసేవారు. పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా మంది సైలెంట్గా డబ్బులు ఇచ్చేవారు. ఇలా పలువుర్ని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని పోలీసులు భావిస్తున్నారు.
తాజాగా, ఈ వ్యవహారంలో డీజీపీకి కూడా సంబంధం ఉందంటూ మరో అధికారి డీజీ శర్మ బాంబు పేల్చారు. మధ్యప్రదేశ్ డీజీపీ వీకే సింగ్పై స్పెషల్ టాస్క్ఫోర్స్ అండ్ సైబర్ సెల్ డీజీ పురుషోత్తమ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్స్ కుంభకోణం విషయం వెలుగు చూడగానే డీజీపీ వీకే సింగ్ ఘజియాబాద్లో తాను ఉంటున్న అపార్ట్మెంట్ను ఉన్నపళంగా ఖాళీ చేయడంతో వివాదం మొదలైంది. ఈ అపార్ట్మెంట్కు సెక్స్ రాకెట్లోని వ్యక్తులతో సంబంధం ఉండటమే కారణమనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఈ స్కాంలో ఇంకెంతమంది బయటకు వస్తారనేది ముందు ముందు కాని తెలియదు..
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)