OBC Certificate Cancelled in West Bengal: బీసీ కోటాను మమతా బెనర్జీ ముస్లింలకు కట్టబెట్టారు! కోల్ కతా హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
హైకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని తాము ఆమోదించబోమని మమతా బెనర్జీ చెబుతున్నారని, కోర్టు ఉత్తర్వులను మన్నించబోమని చెప్పే ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని తాను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నానని చెప్పారు.
New Delhi, May 22: 2010 తర్వాత పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను (OBC Certificates) కలకత్తా హైకోర్టు రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) స్పందించారు. ఎలాంటి సర్వే చేపట్టకుండా మమతా బెనర్జీ 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చారని, దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. బీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ను కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంక్కు అందించాలని మమతా బెనర్జీ కోరుకున్నారని చెప్పారు. ఆపై బీసీ కోటాను ముస్లిం కులాలకు మమతా బెనర్జీ (Mamatha Benarjee) కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు. హైకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని తాము ఆమోదించబోమని మమతా బెనర్జీ చెబుతున్నారని, కోర్టు ఉత్తర్వులను మన్నించబోమని చెప్పే ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని తాను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నానని చెప్పారు.
తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ ఓబీసీ రిజర్వేషన్ను నీరుగార్చిందని అమిత్ షా దుయ్యబట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఓబీసీ రిజర్వేషన్కు తూట్లు పొడిచారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వీరు కొల్లగొట్టి మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలకు వాటిని కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.