Andhra Pradesh Rains: ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం, పలు తీరాల్లో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలు, భారీ వర్షాలతో ఏపీ విలవిల

వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది.

High Tidal Waves Off Gujarat Coast (Photo Credits: ANI)

Vjy, Oct 17: వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు తీర ప్రాంత, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలు భారీ వరదల ధాటికి అస్త్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల జనజీవనం స్తంభించింది. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలోని ఆర్కే బీచ్‌ వద్ద అలలు దగ్గర్లో ఉన్న దుకాణాలను తాకుతున్నాయి.

కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. చెట్లు, విద్యుత్‌, స్తంభాలు, ఇళ్లు నేల కూలాయి. అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గోదావరి సంగమం వద్ద అలలు ఎగసిపడగా.. పల్లిపాలెంలో ఇళ్లు, బీచ్‌ రోడ్డును అలలు ముంచెత్తాయి. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. ఓఎన్‌జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువులను సముద్రం నీరు ముంచెత్తింది.

శ్రీసత్యసాయి జిల్లా సి.కె.పల్లి మండలం వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోనిపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నప్పరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. వైఎస్సార్‌ జిల్లాలో గండికోట జలాశయం, మైలవరం జలాశయాలకు వరద నీరు వచ్చి చేరతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది.

పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్‌ జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నెల్లూరు నగర శివారులోని ఆటోనగర్, చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, జొన్నవాడ రోడ్డు, పొట్టేపాలెం కలుజు ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి వర్షానికి పంట తడిసింది. ఆరబోసిన మొక్కజొన్న, వేరు శనగ తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి నీటమునిగింది.

రాష్ట్రంలో భారీవర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు ఆయనకు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను అధికారులు వివరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement