AP Capital Row: అమరావతిపై హైకోర్టులో విచారణ నవంబర్ 28కి వాయిదా, రాజధాని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh government) అమలుచేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో (High Court) విచారణ జరిగింది.
Amaravati, Oct 18: రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh government) అమలుచేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో (High Court) విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ... హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో (Supreme Court ) ఎస్ఎల్పీ దాఖలు చేసిందని, ఈ ఎస్ఎల్పీలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ శుక్రవారం కొన్ని లోపాలను లేవనెత్తిందని వాటిని సరిచేస్తామని, పది రోజుల్లో అది విచారణకు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను నవంబర్ 28న చేపడతామని తెలిపింది.ఈలోపు సుప్రీం కోర్టు తమ తీర్పుపై ఏం చెబుతుందో కూడా తెలుస్తుందని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటితో పాటు రాజధానికి సంబంధించి మరికొన్ని వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీని సాకుగా చూపుతూ హైకోర్టు తీర్పు అమలుకు గడువు పొడిగింపు కోరుతూ పోతోందని చెప్పారు.
ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషన్లో లిఖితపూర్వకంగా లేవనెత్తిన అంశాలపై మాత్రమే తాము సమాధానం ఇస్తామన్నారు. ఏది పడితే అది మాట్లాడితే స్పందించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఏజీ చెప్పిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని, తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలికసదుపాయాలను తీర్పు ఇచ్చిన తేదీ నాటినుంచి నెలరోజుల్లో పూర్తి చేయాలని, అలాగే రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన రైతులకు తీర్పు ఇచ్చిన నాటినుంచి మూడు నెలల్లో అన్ని మౌలికవసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏను ఆదేశిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి మూడోతేదీన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధాని నగరం, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలని స్పష్టంచేసింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)