High Tension at Kuppam: కుప్పంలో అసలేం జరిగింది, పోలీసుల తీరుపై రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన, వైసీపీ కార్యకర్తపై దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన వైసీపీ
అధికార, ప్రతిపక్షాలు (YCP vs TDP) బాహాబాహీ యుద్ధానికి దిగాయి. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఓ అభిమాని పార్టీ గుర్తు చూపడంతో ఆ పార్టీ నేతలపై చంద్రబాబు ఎదుటే తెలుగు తమ్ముళ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Kuppam, August 25: కుప్పంలో హైటెన్షన్ వాతావరణం (High Tension at Kuppam) నెలకొంది.చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత మూడ్రోజుల పర్యటన (Chandra Babu Kuppam Tour) బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో పర్యటించారు. నేడు గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని (TDP Office) ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్షాలు (YCP vs TDP) బాహాబాహీ యుద్ధానికి దిగాయి. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఓ అభిమాని పార్టీ గుర్తు చూపడంతో ఆ పార్టీ నేతలపై చంద్రబాబు ఎదుటే తెలుగు తమ్ముళ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో చంద్రబాబు రెండో రోజు పర్యటనను అడ్డుకుంటామంటూ వైకాపా శ్రేణులు పేర్కొనడం.. బంద్కు పిలుపునివ్వడంతో ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కుప్పం పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. బంద్ పిలుపుతో ఆర్టీసీ డిపో ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది.రామకుప్పంలో నిరసన ర్యాలీ చేపట్టేందుకు వైకాపా శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలంతా కుప్పం చేరుకోవాలని ఇప్పటికే వాట్సప్ సందేశాలు వెళ్లాయి.
Here's Kuppam Tension VIsuals
మరోవైపు తెదేపా అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని పిలుపు మేరకు భారీఎత్తున శ్రేణులు కుప్పం చేరుకుంటున్నాయి. ఇరు పార్టీలు పోటాపోటీ ప్రదర్శనలకు సిద్ధమవుతుండటంతో కుప్పంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. రామకుప్పం మండలం కొల్లుపల్లెలో వైకాపా, తెదేపా మధ్య జరిగిన ఘర్షణ పునరావృతం కాకుండా ఎస్పీ రిషాంత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు చేపట్టారు. పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
రెండోరోజు పర్యటనలో భాగంగా పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉండగా.. వైకాపా శ్రేణులు దాన్ని ధ్వంసం చేశాయి. దీంతో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు కుప్పం చేరుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు సహా నేతలు, భారీగా కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది.
మరోవైపు వైకాపా ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు వెళ్లేందుకు తెదేపా శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అన్నా క్యాంటీన్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసన తెలిపారు.
Anna Canteen Damage Visuals
కుప్పంలో అన్నా క్యాంటీన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబును కుప్పంలో తిరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు.
సీఎం జగన్ దర్శకత్వంలో వైకాపా శ్రేణులు అన్న క్యాంటీన్ను ధ్వంసం చేశాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కుప్పంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కుప్పం ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కుప్పంలో వైకాపా శ్రేణులను పోలీసులు నియంత్రించాలని.. లేకుంటే సీఎంవో, డీజీపీ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. త్వరలో కడపలో సమావేశం పెడతామని.. ఎలా అడ్డుకుంటారో చూస్తామని తీవ్రస్థాయిలో అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇక టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలు చేస్తున్నాయి. బుధవారం శ్రీనివాసులుపై జరిగిన దాడికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆందోళనల నేపథ్యంలో కుప్పంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్టీ నేతల ఆందోళనల మధ్య కుప్పంలో పోలీసులు భారీగా మోహరించారు.