Telangana Weather Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణలో మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది
Hyd, May 19: తెలంగాణలో మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ద్రోణి శుక్రవారం తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది.
దిగువ స్థాయిలో గాలులు వాయశ్య దిశ నుంచి తెలంగాణలోకి వీస్తున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరాయి. నికోబార్ ఐలాండ్స్, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.