Seunderabad Fire: సికింద్రాబాద్లో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అగ్నిప్రమాదం.. లాడ్జీలోని ఎనిమిది మంది పర్యాటకుల మృతి.. ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం కిటికీల మీద నుంచి దూకిన టూరిస్టులు.. వీడియోలు వైరల్
సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయ సమీపంలో ఐదంతస్తుల భవనంలో కింది ఫ్లోర్లో ఎలక్ట్రిక్ వాహన షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిన పర్యాటకులు.. ఏడుగురు మృతి.. మృతుల్లో విజయవాడ, చెన్నై, ఢిల్లీకి చెందినవారు.. మృతి చెందిన ఏడుగురిలో ఆరుగురు పురుషులే.. తీవ్రంగా గాయపడిన మరో 10 మందికి గాంధీ, యశోద ఆసుపత్రుల్లో చికిత్స
Seunderabad, September 13: సికింద్రాబాద్లోని ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో గత రాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం కారణంగా ఓ లాడ్జీలోని ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడున్న ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆపై అవి దానిపైన ఉన్న లాడ్జిలోకి వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో లాడ్జీలోని పర్యాటకులు ఊపిరాడక ఎక్కడికక్కడ స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన ఎ.హరీశ్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్టు గుర్తించారు. మిగిలిని వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
సికింద్రాబాద్లోని పాస్పోర్టు కార్యాలయ సమీపంలో ఓ ఐదంతస్తుల భవనం ఉంది. ఇందులోని నాలుగు అంతస్తుల్లో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ఫ్లోర్, సెల్లార్లో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూముును నిర్వహిస్తున్నారు. గత రాత్రి 9.40 గంటల సమయంలో గ్రౌండ్ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనాల్లోని బ్యాటరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. దీంతో వాహనాలు అంటుకుని మంటలు భయానకంగా ఎగసిపడ్డాయి. ఆపై పై అంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు దట్టమైన పొగలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు, మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గంలేని పర్యాటకలు భయంతో హాహాకారాలు చేశారు. రక్షించమని కేకలు వేశారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. తప్పించుకునే మార్గం కనిపించకుండా పోయింది. ఇంకోవైపు పొగ దట్టంగా కమ్మేయడంతో ఊపరి ఆడక పర్యాటకులు సృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
మంటలు అంటుకుని నలుగురు చనిపోయారు. కిందికి దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన నలుగురు ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోటల్ గదుల్లో చిక్కుకున్న వారిని హైడ్రాలిక్ క్రేన్ సాయంతో రక్షించారు. క్షతగాత్రులను సికింద్రాబాద్లో గాంధీ, యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించే అవకాశం ఉండడంతో వాటిని ఖాళీ చేయించారు.
సమాచారం అందుకున్న వెంటనే మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న తదితరులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి షార్ట్సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)