TS Lockdown: మళ్ళీ లాక్డౌన్ ఉండకూడదు, కఠినంగా అమలు చేయాలని పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు, ఉదయం 10 గంటల తర్వాత వాహనం కనిపిస్తే సీజ్, ఈ ధపా అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు
తెలంగాణలో కోవిడ్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగించిన సంగతి విదితమే. లాక్డౌన్ ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని (Telangana Enforce lockdown rules strictly) పోలీసు అధికారులకు డీ.జీ.పీ ఎం. మహేందర్ రెడ్డి (DGP M Mahender Reddy) ఆదేశించారు.
Hyderabad, May 19: తెలంగాణలో కోవిడ్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని (Telangana Enforce lockdown rules strictly) పోలీసు అధికారులకు డీ.జీ.పీ ఎం. మహేందర్ రెడ్డి (DGP M Mahender Reddy) ఆదేశించారు. లాక్డౌన్ ను అమలుపై జోనల్ ఐజీలు, డీ.ఐ.జీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డి.జి.పి జితేందర్, ఇంటలిజెంట్స్ విభాగం ఐ.జి ప్రభాకర్ రావు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫ్ రెన్స్ లో డీ.జీ.పీ (M Mahender Reddy) మాట్లాడుతూ... రాష్ట్రంలో లాక్ డౌన్ (TS Lockdown) అమలుతీరును ప్రతిరోజు జిల్లాల వారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సమీక్షిస్తున్నారని తెలియజేశారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్డౌన్ ను (Telangana Lockdown) పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లే విధంగా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై సరైననా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే సీజ్
కరోనావైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.
ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలని సూచించారు.
లాక్డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్డౌన్ అమలుపై సామన్య ప్రజానికం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసు శాఖపై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే లాక్డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు.
అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు
ఈ ధపా లాక్డౌన్ లో రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది.వ్యవసాయ ధాన్యం తరలింపు వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు లాక్డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్కు ఇబ్బంది పడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇకపై రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లాక్డౌన్ సడలింపుల అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లాక్ డౌన్ విధించడానికి ముందు.. ఏప్రిల్ 20 నుంచి మే 12 మధ్య.. రోజూ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. మే 12 నుంచి ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజల నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు నాలుగు గంటల పాటు అన్నిరకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్
నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పోలీస్ సహాయక కేంద్రాలతో పాటు భద్రతను పర్యవేక్షించారు. మొదట నారాయణ గూడ పీఎస్ పరిధిలోని కింగ్ కోటి హాస్పిటల్ను సందర్శించిన సీపీ.. అనంతరం పోలీస్ కొవిడ్ సహాయ కేంద్రంతో పాటు భద్రత పరిస్థితులను పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెంట నగర అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్, ఏసీపీ మురళి కృష్ణ ఉన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ ప్రశాంతం: సీపీ సజ్జనార్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని సీపీ సజ్జనార్ తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై 14 వేల కేసులు నమోదు చేశామని తెలిపారు. దాదాపు 600 పైగా వాహనాలు సీజ్ చేశామన్నారు.
సిటీ ఔట్ స్కట్ కావడం వలన సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు. ఈ నెల 30 వరకు ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిందని... ఈ నెల 30 వరకు లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తామన్నారు. అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.