Manchu Vishnu Warns Youtubers: య్యూటూబర్లకు మంచు విష్ణు మాస్ వార్నింగ్, 48 గంటల్లోగా ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
48 గంటల్లోగా అలాంటి వాటిని తొలగించాలని హెచ్చరించాడు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నాడు
Hyderabad, July 10: కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో (You tube Channels) ప్రసారమౌతోన్న అభ్యంతరకర, అసభ్య కంటెంట్తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. 48 గంటల్లోగా అలాంటి వాటిని తొలగించాలని హెచ్చరించాడు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నాడు (Manchu Vishnu Warning). ఇటీవల ఓ తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. ఇది తెలుగు వారి స్వభావం కాదన్నాడు. తెలుగు సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన దృష్టికి వచ్చిన కొన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల్లోని కథనాలను చూడగా.. అత్యంత జుగుప్సాకరంగా ఉంటోన్నాయన్నారు. వాటి గురించి మాట్లాడాలంటేనే ఒళ్లు జలదిస్తోందని తెలిపాడు. ఈ మేరకు విష్ణే ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
వీటిని నియంత్రించడానికి ఇటీవలే హీరో సాయి ధరమ్ తేజ్ (Saidharam tej) సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని విష్ణు గుర్తు చేశారు. వెంటనే స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డీజీపీకి ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశాడు.
మహిళలకు గౌరవించలేనప్పుడు మనిషిగా బతికి ఉపయోగం లేదన్నాడు. సెక్యువల్ కంటెంట్తో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతీ రోజు హీరో, హీరోయిన్లు, నటీనటులు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తనను కోరుతున్నారన్నాడు. ఇలాంటి కంటెంట్ను సోషల్ మీడియాలో తొలగించాలన్నాడు. ఇందుకు 48 గంటల సమయం ఇస్తున్నట్లు చెప్పాడు. అప్పటిలోగా తొలగించకపోతే సైబర్ క్రైమ్ విభాగానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.