Schools Reopening Date in AP: రేపటి నుంచి ఏపీలో మోగనున్న బడిగంట, అన్ని రకాల చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం, స్కూళ్లు తెరిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది

ap-govt-issues-notification-for-implementation-of-english-medium-from-next-year (Photo-Twitter)

Amaravati, August 15: రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది. సోమవారం నుంచి అన్ని తరగతులు (Schools in Andhra Pradesh) ప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తి చేశారు.

కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ప్రభుత్వం ( Andhra Pradesh Govt) తెలిపింది. అయినప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా సెక్షన్‌కు 20 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకు గదులు సరిపోకపోతే 6, 7, 8 తరగతులకు ఒక రోజు, 9, 10 తరగతులకు మరుసటి రోజు (రోజు విడిచి రోజు) తరగతులు నిర్వహిస్తారు.

ప్రాథమికంగా అంటే 1, 2, 3 తరగతులకు ఒక రోజు, 4, 5 తరగతులకు మరుసటి రోజు తరగతులు ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. పాఠశాల తరగతి గదుల్లోనే కాకుండా ఆవరణలో, బయట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్‌ చేయిస్తున్నారు. పిల్లల్లో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వారిని వేరుగా ఉంచేందుకు ఐసోలేషన్‌ రూమును ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీ, ఆసుపత్రికి తెలియచేసి, వారికి వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో కర్ప్యూ

గతంలో ఎన్నడూ లేని విధంగా మనబడి నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎంఆర్‌సీ, భవిత కేంద్రాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 15,715 స్కూళ్లలో రూ.3,600 కోట్లకు పైగా నిధులతో వివిధ సదుపాయాలు కల్పించింది. రెండో విడతలో రూ.4,800 కోట్లతో 16 వేల పాఠశాలల అభివృద్ధి పనులకు ఈనెల 16న శ్రీకారం చుట్టనుంది.

స్కూళ్లు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

►10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసినందున వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్‌ కేసులను గుర్తిస్తుండాలి.

►బోధన, బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ హాజరు కావాలి. రెగ్యులర్‌ సమయం ప్రకారమే తరగతులు కొనసాగాలి.

►అన్ని విద్యా సంస్థల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి.

►పోర్టబుల్‌ థర్మల్‌ స్కానర్‌తో ప్రవేశద్వారం వద్దే విద్యార్థులను పరిశీలించాలి. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ఇంటికి పంపి, పరీక్షలు చేయించుకోమని చెప్పాలి.

►శానిటైజర్‌ ఏర్పాటు చేసి, తరచూ చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్‌ వర్కులు, గేమ్స్‌ వంటివి నిర్వహించరాదు.

►తరగతి గదుల్లో 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి. టాయిలెట్ల వద్ద, భోజనాల సమయంలోనూ ఇది పాటించాలి. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.

►ఇళ్లలో వృద్ధులైన తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఉంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇళ్ల వద్దనే ఉండాలి.

►రోగగ్రస్థులుగా ఉన్న విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరాదు.

►మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. పాఠశాల వదిలినప్పుడు గుంపుగా బయటకు పంపకూడదు.

►ప్రతి వారం ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్‌ టెస్టులు చేయాలి. ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలుంటే అందరికీ పరీక్షలు చేయించాలి.

►కోవిడ్‌పై తీసుకోవలసిన జాగ్రత్తలకు పీరియడ్‌ను కేటాయించాలి. స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేసేలా అవగాహన కల్పించాలి.

►పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్‌లు, పుస్తకాలు, వాటర్‌ బాటిళ్లు, గ్లాసులు ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం.

►టాయిలెట్లను రోజూ శుభ్రం చేయించాలి. స్కూలు బస్సుల్లేని పిల్లలను తల్లిదండ్రులే స్కూళ్ల వద్ద దింపాలి.

►ప్రతి స్కూలులో కోవిడ్‌ జాగ్రత్తల అమలుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. మిగిలిపోయిన టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి.

జగనన్న విద్యాకానుక కిట్లను రూ.800 కోట్లతో ఈనెల 16 నుంచి 31వ తేదీలోగా రాష్ట్రంలోని దాదాపు 48 లక్షల మంది విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, తరగతి, కిట్లలోని వస్తువులను పొందుపరుస్తున్నారు. 3 జతల యూనిఫాం క్లాత్, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్కులు, నోట్‌ బుక్కులు తదితరాలను కిట్‌ రూపంలో అందిస్తారు.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెట్టినందున పక్కపక్క పేజీల్లో ఇంగ్లిష్, తెలుగులో మిర్రర్‌ ఇమేజ్‌లో ఉండే బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులకు సులభంగా ఆయా పదాలు అర్థం చేసుకోవడానికి 1–5వ తరగతి వరకు బొమ్మలతో ఉన్న డిక్షనరీలు, 6–10 తరగతుల విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు అందిస్తున్నారు. యూనిఫాం వస్త్రం, షూ కొలత సరిగా లేకున్నా, బ్యాగు నాణ్యత బాగోలేకున్నా వెనక్కు పంపి, మంచివి తెప్పించుకోవాలని చెప్పింది. లోపాలున్న వాటిని సెప్టెంబర్‌ 15 కల్లా తిరిగి పంపి ఆ విషయాన్ని రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి. టోల్‌ ఫ్రీ నంబర్‌ 9154296169కు ఫిర్యాదు చేయొచ్చు. జగనన్న విద్యాకానుకపై యాప్‌ను కూడా రూపొందించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now