Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్ కతా, భువనేశ్వర్ ను తాకిన ప్రకంపనలు
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.
Newdelhi, Feb 25: బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో (Earthquake In Bay Of Bengal) 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రతతో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా (Kolkata), ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) తోపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూకంపం కారణంగా దేశంలోని తూర్పు తీర ప్రాంత నగరవాసులు భయాందోళనలు గురయ్యారు. సునామీ హెచ్చరికలకు సంబంధించిన విషయాలేమీ ఇంకా తెలియరాలేదు.
మొన్న ఢిల్లీలో కూడా
గతవారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే. ఈనెల 17న ఉదయం 5.36 గంటలకు ఢిల్లీ ఎన్సీఆర్ లో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ స్వయంగా సూచించడం తెలిసిందే.