Covid Updates: రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ కఠిన ఆంక్షలు, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, అయిదు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం, దేశంలో తాజాగా 10,584 మందికి కరోనా, బెంగళూరులో బిల్డింగ్ సీజ్
దేశంలో గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 13,255 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు (Coronavirus in Inida) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
New Delhi, Feb 23: దేశంలో గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 13,255 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు (Coronavirus in Inida) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,463 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,12,665 మంది కోలుకున్నారు.
1,47,306 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,17,45,552 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,22,30,431 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,78,685 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఇండియాలో గత సంవత్సరం నవంబర్ తరువాత, యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తొలిసారిగా భారీగా పెరగడంతో పాటు, 17 రోజుల తరువాత మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా, 4,421 కేసులు వచ్చాయి. నవంబర్ నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి.
ఆపై తిరిగి నిన్న ఆ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.
మహారాష్ర్ట, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ర్ట సరిహద్దులతో పాటు అన్ని రైల్వేస్టేషన్లు, డెహ్రాడూన్ ఎయిర్పోర్టులో కరోనా టెస్టు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు డెహ్రాడూన్ డిస్ర్టిక్ట్ మెజిస్ర్టేట్ తెలిపారు.
కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళకు పొరుగున్న ఉన్న రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్లోకి ప్రవేశించే వారిలో కరోనా లక్షణాలన్న వారిని స్క్రీనింగ్ చేసేందుకు సరిహద్దుల వద్ద పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. మరోవైపు కేరళ నుంచి కర్ణాటకలోకి ప్రవేశించాలంటే ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగిటివ్ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అలాంటి వారిని మాత్రమే కర్ణాటకలోకి అనుమతించాలని నిర్ణయించింది.
అయితే నిత్యవసరాల వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కర్ణాటక డీజీపీ వెల్లడించారు. కాగా, కేరళ సీఎం విజయన్ దీనిపై స్పందించారు. కేరళ, కర్ణాటక సరిహద్దుల రహదారులను మూసి వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కరోనా సంక్షోభ నిర్వహణపై కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన జిల్లాలతోపాటు భోపాల్, ఇండోర్, హోషంగాబాద్, బేతుల్, సివ్ని, చింద్వారా, బాలాఘాట్, బార్వానీ, ఖండ్వా, ఖార్గోన్, బుర్హాన్పూర్, అలీరాజ్పూర్ జిల్లాల కలెక్టర్లను మధ్యప్రదేశ్ హోంశాఖ ఆదేశించింది.
మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5,210 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు కరోనా కట్టడి చర్యలు పాటించకపోతే తిరిగి లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. కాగా కరోనా కేసులు పెరుగుతున్నందున నాగ్పూర్లో మార్చి 7 వరకూ స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అమరావతి జిల్లాలో మార్చి ఒకటి వరకూ లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా అమరావతికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి యశోమతి ఠాకుర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్డౌన్ పరిష్కారం కాదని, ఇది తప్పనిసరి చర్య అని అన్నారు. కరోనా కేసులు తగ్గితేనే, దానిని నియంత్రించగలమని అన్నారు.
కర్నాటక రాజధానిలో ఓ బిల్డింగ్లో పది మందికి పాజిటివ్ వచ్చింది. 1500 మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పది మందికి కోవిడ్ వచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి 22వ తేదీ మధ్య వారంతా పాజిటివ్గా తేలినట్లు బీబీఎంపీ కమీషన్ మంజునాథ్ ప్రసాద్ తెలిపారు. దీంతో ఆరు బ్లాక్లను కంటేన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ రెసిడెన్షియల్ సొసైటీలో రెండు మ్యారేజ్ పార్టీలు జరిగిన తర్వాత కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారీ స్థాయిలో టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించింది. పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారిలో ఎక్కువ శాతం మంది 50 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నట్లు డాక్టర్ కృష్ణప్ప తెలిపారు. మహారాష్ట్ర, కేరళ తర్వాత అత్యధిక కోవిడ్ కేసులు కర్నాటకలోనే ఉన్నాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)