Ujjwala 2.0: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త, మరో కోటి గ్యాస్ కనెక్షన్ల కోసం ఉజ్వల 2.0 స్కీమ్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ఎల్పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవైలో భాగంగా ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్ స్కీమ్ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi Launches Ujjwala 2.0) మంగళవారంనాడు ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం ( Pradhan Mantri Ujjwala Yojana) కింద మరో కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
New Delhi, August 10: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవైలో భాగంగా ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్ స్కీమ్ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi Launches Ujjwala 2.0) మంగళవారంనాడు ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం ( Pradhan Mantri Ujjwala Yojana) కింద మరో కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తొలి విడతలో ఎల్పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో (Mahoba in Uttar Pradesh) జరిగిన కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల యోజన-2021ను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ తొలి విడతలో అవకాశం రాని వారిని పరిగణనలోకి తీసుకుని 2.0 స్కీమ్ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు.
ఈ పథకం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఉజ్వల 1.0 కార్యక్రమాన్ని మే1, 2016న ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. తొలివిడుతలో 80లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందించిన విషయం తెలిసిందే. ఉజ్వల స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరమే కానీ ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనుంది.
ఈ కార్యక్రమంలో మహోబా నుంచి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. మొదటి విడతగా యూపీలోని పేద కుటుంబాలకు 1,47,43,862 ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. ఉజ్వల 2.0 స్కీమ్ను 2021-22 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మహోబా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బయోఫ్యూయల్ ఎగ్జిబిషన్ను సీఎం ఆదిత్యనాథ్, పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రారంభించారు. ప్రపంచ బయోఫ్యూయల్ దినోత్సవంగా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇదే సందర్భంగా ముజఫర్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంప్రెస్సెడ్ బయోగ్యాస్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు.