'Sita's Life is Like a Divorcee': సీతాదేవి జీవితం విడాకులు తీసుకున్న స్త్రీ లాంటిదే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Mohan Yadav ) సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతాదేవి జీవితం విడాకులు తీసుకున్న వ్యక్తి జీవితంలాంటిదే (Sita's Life is Like a Divorcee) అని పోల్చుతూ అగ్గి రాజేశారు
Bhopal, Dec 19: మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Mohan Yadav ) సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతాదేవి జీవితం విడాకులు తీసుకున్న వ్యక్తి జీవితంలాంటిదే (Sita's Life is Like a Divorcee) అని పోల్చుతూ అగ్గి రాజేశారు. సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టమని కోరింది, ఆమె అడవిలో లవ్, కుష్ అనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. చాలా బాధలు అనుభవించి, విడాకులు తీసుకున్న స్త్రీకి సమానమైన జీవితాన్ని గడిపినప్పటికీ, ఆమె తన కొడుకులకు వాళ్ల నాన్నపట్ల గౌరవం నేర్పిందని మంత్రి (Higher Education Minister Dr Mohan Yadav) అన్నారు.
రాముడు ఎన్ని కష్టాలు పెట్టినా.. అడవిలో పిల్లలకు జన్మనిచ్చినా.. ఆయన క్షేమాన్నే సీత కోరుకున్నదని చెప్పారు. ఎన్ని బాధలు ఉన్నా రాముడినే లవకుశలు కీర్తించారని చెప్పుకొచ్చారు. ఆమె భూమిలోకి తిరిగి వెళ్లిపోవడాన్ని నేటి కాలంలో ఆత్మహత్యగా అభివర్ణించారు.కరసేవక్ సమ్మాన్ వేడుకల సందర్భంగా మంత్రి చేసిన ప్రకటన ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఆగ్రహానికి కారణమైంది.
వందేమాతరం గ్రూపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 94 మంది కరసేవకులను సత్కరించాలని నిర్ణయించారు. అయితే, వీరిలో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. చాలా మంది కరసేవకులు తమ భార్య, పిల్లలతో సన్మాన కార్యక్రమానికి వచ్చారు.ఆ సమయంలో సీతా దేవిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు మంత్రి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Here's Video
కరసేవక్ సమ్మాన్ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ శ్రీరాముడి జీవితంలో జరిగిన ఘటనలపై ప్రసంగిస్తూ గర్భం ధరించినప్పటికీ రాజ్య గౌరవం చూసి సీతామాతను రాముడు విడిచిపెట్టాల్సి వచ్చిందన్నారు. సీతామాత పిల్లలు అడవిలో పుట్టాల్సి వచ్చిందని, ఇన్ని బాధలున్నా ఆ తల్లికి తన భర్తపై ఎంతో గౌరవం ఉందని చెప్పారు. కష్టాలను మర్చిపోయి కూడా సీతామాత రాముడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుందని, ఇలాంటి జీవితం నేటి కాలంలో విడాకులు తీసుకున్న తర్వాతి జీవితంలాంటిదన్నారు.
భూమి చీలిపోయి అందులో సీతమ్మ లీనమైపోతుందని, రాముడి ఎదుటే సీతమ్మ తన శరీరాన్ని వదిలేసిందని.. ఇది ఇవాల్టి కాలంలో ఆత్మహత్యగా పరిగణించాల్సి వస్తుందని డాక్టర్ మోహన్ యాదవ్ చెప్పుకొచ్చారు. సీత లేకుండా రాముడు ఒక్క రోజు ఉండటం కూడా ఊహించడం కష్టంగా ఉన్నదన్నారు. రాముడు, సీత త్యాగంలో ప్రేమ ఉన్నదని చెప్పారు. లక్ష్మణుడు కూడా తన జీవితాన్ని రాముడి కోసం త్యాగం చేశాడని, అయినప్పటికీ రామరాజ్యం కొనసాగిందని పేర్కొన్నారు.
దీంతో పాటుగా ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు విషం తాగడం గురించి కూడా మాట్లాడాడు. "శివుడు విషం తాగి ఇతరులకు అమృతాన్ని ఇచ్చాడు. అందుకే అతడిని నీలకంఠుడు- నీలకంఠుడు అని పిలుస్తారు" అన్నాడు.