BJP leader Gyan Dev Ahuja: ఇప్పటిదాకా 5గురిని చంపామంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు
రాజస్తాన్ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవి పెను వివాదాస్పదంగా మారడమే గాక మత విద్వేషాలకు తెరలేపాయి.
Jaipur, August 21: రాజస్తాన్ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవి పెను వివాదాస్పదంగా మారడమే గాక మత విద్వేషాలకు తెరలేపాయి. ఈ మేరకు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ హత్యలు లాలావాండి లేదా బెహ్రూర్లో కావచ్చు అంటూ రక్బర్ ఖాన్, పెహ్లూ ఖాన్ హత్యలు గురించి వీడియోలో ఆయన (Rajasthan BJP leader Gyan Dev Ahuja) ప్రస్తావించారు. అంతేకాదు వాటిలో ఒక హత్యను 2017లో మరోకటి 2018లో చేశామని బహిరంగంగా చెప్పారు. అవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్గఢ్లో జరిగిందని చెప్పడం విశేషం.
కాగా తమ కార్యకర్తలకు చంపడానికి స్వేచ్ఛ ఇచ్చానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారు హత్య చేసిన వెంటనే బెయిల్ పొందడమే గాక నిర్దోషులుగా విడుదలవుతారని చాలా ధీమాగా చెబుతున్నారు. రాజస్తాన్లోని అల్వార్ నియోజకవర్గం బీజేపీ చీఫ్ సంజయ్ సింగ్ మాత్రం అవన్నీ అతని వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు. తమ పార్టీ ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయదంటూ... మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలన్నింటిని తీవ్రంగా ఖండిచారు.
Here's Video
వాస్తవానికి పెహ్లూ ఖాన్, రక్బర్ ఖాన్ ఇద్దరు హర్యానకు చెందిన పాల వ్యాపారులు. ఐతే పెహ్లు ఖాన్ బెహ్రూర్లో 2017 ఏప్రిల్లో హత్యకు గురవ్వగా రక్బర్ ఖాన్ జులై 2018లో లాలావండి గ్రామంలో హత్యకు గురయ్యారు. పోలీసులు కూడా ఈ రెండు మతపరంగా జరిగిన హత్యలుగానే గుర్తించారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా బీజేపీ మతపరమైన ఉగ్రవాదానికి, మతోన్మాదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. బీజేపీ రంగు బట్టబయలైంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపుతున్నాయి.