AP Local Body Elections 2021: ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఎన్నికలు నిర్వహించలేం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో అధికారులు బిజీ, ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... హౌస్ మోషన్కు సిద్ధమైంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం వాదించనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టుకు నేటి నుంచి సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.
Amaravati, Jan 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ (AP Local Body Elections 2021) విడుదల చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం కోరిన కొద్ది గంటల్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. జనవరి 23వ తేదీ నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని నోటిఫికేషన్లో (AP Local Body Election Poll Schedule Released) వెల్లడించారు.
నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh Kumar) తెలిపారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. ఇక, ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13 మూడో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ప్రకటించారు. ఇక, పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్, ఇతర అధికారులు నిమ్మగడ్డతో భేటీ అయ్యారు. ఎస్ఈసీతో గంటన్నరపాటు సీఎస్ బృందం సమావేశం కొనసాగింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ బృందం తెలిపింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించామని సీఎస్ బృందం పేర్కొంది. కేంద్రం సూచనలతో ఇవాళ కూడా డ్రైరన్ నిర్వహించామన్నారు. తొలి విడతగా కోటిమందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని, 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున వ్యాక్సినేషన్కు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని సీఎస్ బృందం తెలిపింది. రాష్ట్రంలోని యంత్రాంగమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉందని.. వాలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉందని సీఎస్ తెలిపారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమయ్యాయని, దీనిపై ఈనెల 9న కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని.. ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారని.. ఈ నేపథ్యంలో ఈనెల 13 వరకూ ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్ సన్నద్ధత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని.. అప్పటివరకూ సమావేశాన్ని వాయిదా వేయాలని ఎస్ఈసీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
అయితే వారు వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఎస్ఈసీ పంచాయతీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈసీ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయనుంది. రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కోవిడ్ కేసు నమోదైనప్పుడు దాన్ని కారణంగా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేస్తూ గతేడాది మార్చి 15న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ తాజాగా వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అంతా తీరిక లేకుండా ఉన్న తరుణంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించనుంది. ఇప్పటికే ఈ అంశంపై ద్వివేది గత రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... హౌస్ మోషన్కు సిద్ధమైంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం వాదించనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టుకు నేటి నుంచి సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. మరికాసేపట్లో న్యాయమూర్తి ఇంటి దగ్గరే హౌస్ మోహన్ పిటిషన్పై వాదనలు జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే హైకోర్టుకు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టును హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్లుంటారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్లు ధర్మాసనంలో కేసులను విచారిస్తే, జస్టిస్ గంగారావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ నెల 11న వెకేషన్ కోర్టు కేసులను విచారిస్తుంది. 12 తర్వాత వరుసగా ప్రభుత్వ సెలవులు కావడంతో హైకోర్టు ఈ నెల 18న పునఃప్రారంభమవుతుంది
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)