AP Student Dies in US Road Accident: అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి ఒకరు మరణించారు. మృతుడిని ఏపీకి చెందిన బీలం అచ్యుత్ గా గుర్తించారు.
Newyork, May 24: అమెరికాలో (America) జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో (Road Accident) తెలుగు విద్యార్ధి (Telugu Student) ఒకరు మరణించారు. మృతుడిని ఏపీకి చెందిన బీలం అచ్యుత్ గా గుర్తించారు. అతడు న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. అచ్యుత్ మరణవార్త విని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
ఎంబసీ ఏమన్నదంటే?
‘న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బుధవారం మధ్యాహ్నం జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అకాల మరణం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్ కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’ అని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు.