Durga Flyover Opening Date: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు, రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు ఈనెల 16న శంకుస్థాపనలు, దుర్గ ప్లై ఓవర్ కూడా అదే రోజు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న16 జాతీయ ప్రాజెక్టులకు (National Projects) శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి శంకర నారాయణ (R&B Minister Sankhar Narayana) శనివారం తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari), సీఎం వైఎస్ జగన్లు (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Amaravati, Oct 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న16 జాతీయ ప్రాజెక్టులకు (National Projects) శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి శంకర నారాయణ (R&B Minister Sankhar Narayana) శనివారం తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari), సీఎం వైఎస్ జగన్లు (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత నెల 18వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. రూ.15,622 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, చేపట్టబోయే వాటికి శంకుస్థాపనలు జరగనున్నాయి.
ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. మొత్తం 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు.
శంకుస్థాపనలు జరిగే 16 ప్రాజెక్టుల్లో.. రూ.2,225 కోట్లతో చేపట్టనున్న రేణిగుంట– నాయుడుపేట ఆరులేన్ల రహదారి, రూ.1,225 కోట్లతో చేపట్టనున్న విజయవాడ బైపాస్, రూ.1,600 కోట్లతో నిర్మించనున్న గొల్లపూడి–చినకాకాని ఆరు లేన్ల రహదారితోపాటు కృష్ణా నదిపై మేజర్ బ్రిడ్జి ముఖ్యమైనవి.
జాతికి అంకితం చేసే ప్రాజెక్టుల్లో.. రూ.2,075 కోట్లతో నిర్మించిన కడప–మైదుకూరు–కర్నూలు నాలుగు లేన్ల రహదారి (ఎన్హెచ్–40), రూ.1,470 కోట్లతో చేపట్టిన విజయవాడ–మచిలీపట్నం నాలుగు లేన్లు (బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్తో కలిపి), రూ.1,100 కోట్లతో చేపట్టిన నలగంపల్లి–ఏపీ/కర్ణాటక సరిహద్దు నాలుగు లేన్లు, రూ.1,470 కోట్లతో నిర్మించిన రణస్థలం–ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు, రూ.501 కోట్లతో చేపట్టిన కనకదుర్గ గుడి ఆరు లేన్ల ఫ్లై ఓవర్ ముఖ్యమైనవి.
ఇక బెంజిసర్కిల్పై ఫిబ్రవరి నుంచే ఒకవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు దానిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన కనకదుర్గ ఫ్లైఓవర్ను (Durga Flyover Opening Date) ఈ నెల 16న ప్రారంభిస్తారు. తొలుత ఈ కార్యక్రమాలను సెప్టెంబర్ నాలుగున చేపట్టడానికి ముహూర్తం నిర్ణయించారు. కానీ అప్పట్లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో ఆ ముహూర్తాన్ని 8కి మార్చారు. అన్నీ సన్నద్ధమవుతున్న తరుణంలో సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు. ఇంతలో కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈనెల 16న వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.