Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన కోవిడ్-19 కేసులు, ఎంతమందికైనా చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం కేసీఆర్, రెండో దశ లాక్డౌన్ అమలు పట్ల ఉన్నతస్థాయి సమీక్ష
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతుందని. లాక్ డౌన్ అమలు, నిరుపేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిధులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం ఎప్పట్లాగే కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.
Hyderabad, April 16: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల (COVID-19 in Telangana) సంఖ్య గురువారం ఉదయం నాటికి 650కి చేరింది. వీరిలో 118 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా, మొత్తం 18 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల్లో పెరుగుదల, 2వ దశ లాక్డౌన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు,పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ కరోనా వైరస్ నిర్థారణ 02పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ అమలు, నిరుపేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిధులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం ఎప్పట్లాగే కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.
సీఎం మాటల్లో.. ‘‘కరోనా వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పిపిఇ కిట్లకు ఏమాత్రం కొరతలేదు. ఇప్పటికే 2.25 లక్షల పిపిఇ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పిపిఇ కిట్లకు ఆర్డర్ ఇచ్చాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 10 లక్షల పిపిఇ కిట్లను కలిగి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకంటుంది. మరో 5 లక్షలకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసి పెట్టింది. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
‘‘లాక్ డౌన్ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి. ఆరోగ్య, మున్సిపల్ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి’’ అని సీఎం కోరారు.
‘‘లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. బాగా కష్ట పడుతున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అవన్నీ అందాల్సిన వారికి అందుతున్నాయి. ప్రతీ పేద కుటుంబానికి 1500 చొప్పున నగదు అందించాలనే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశాం. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రత్యేక నగదు ప్రోత్సాహం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీకు ఏప్రిల్ నెల కోసం రూ.308 కోట్లు , అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ. 148 కోట్లు విడుదల చేశాం’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)