Onion Price Rise Row: హైదరాబాద్లో రూ. 35కే కిలో ఉల్లి, ఏపీలో రూ. 40కే.., దేశ వ్యాప్తంగా సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు, పూణేలో ఉల్లిపాయల దొంగతనం, ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం
హైదరాబాద్లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు.
Hyderabad, Oct 24: నిన్న మొన్నటివరకు టమాటా సెంచరీ కొట్టగా ఇప్పుడు దానికి తోడుగా ఉల్లి (Onion Price Rise) చేరింది. హోల్సేల్ మార్కెట్లలో ధరలు అనూహ్యంగా పెరగడంతో రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లి రేటు (Onion Price Hike) దేశంలో రూ.100 దాటింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మొన్నటి వరకు ఠారెత్తించిన ధరలతో పాటు.. ప్రస్తుతం ఉల్లి ఘాటుకు సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఉల్లిని (Onions) రైతు బజార్లలో తక్కువ ధరకే విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను రూ.40కే విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని రైతు బజార్లలో శనివారం నుంచి.. అన్ని రైతు బజార్లలో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానం రైతు బజార్లో ఉల్లి విక్రయాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి 6 వేల క్వింటాళ్లను తెచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
గతంలోనూ రూ.60 కోట్ల భారం పడినా ప్రభుత్వమే సబ్సిడీపై ప్రజలకు అందించిందని గుర్తు చేశారు. దుకాణాల వద్ద ధరల బోర్డులు పెట్టాలని, అలా పెడుతున్నదీ లేనిదీ కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లో అధికారులు 140 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు నుంచి వచ్చిన 2,881 బస్తాలనూ కొనుగోలు చేసి ప్రతి జిల్లాకు 10 టన్నుల చొప్పున తరలించారు.
ఇక హైదరాబాద్లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు.
ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిని కొనుగోలు చేయొచ్చు అని తెలిపారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదని చెప్పారు. లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఉల్లి దిగుమతుల నిబంధనలను కేంద్రం సడలించింది. తాజాగా ముందస్తు నిల్వల (బఫర్ స్టాక్) నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీలా నందన్ ఓ ప్రకటనలో తెలిపారు.
అసోం, ఏపీ, బిహార్, చండీగఢ్, హరియాణా, తెలంగాణ, తమిళనాడు ఈ నిల్వల నుంచి 8,000 టన్నులు తీసుకొంటున్నాయని, ఇతర రాష్ట్రాల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో నిల్వ చేసిన బఫర్ స్టాక్ సేకరణ ధరకే (రూ.26-28) కేంద్రం సరఫరా చేస్తుందన్నారు. ఆయా రాష్ట్రాలకు నేరుగా సరఫరా కావాలంటే కిలో రూ.30 చొప్పున ఇస్తామని అన్నారు.
ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించిన కేంద్రం.. టోకు వర్తకులు 25 మెట్రిక్ టన్నులు, చిల్లర వర్తకులు రెండు మెట్రిక్ టన్నులకు మించి నిల్వ చేయడానికి వీల్లేదని తెలిపింది. డిసెంబర్ 31 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యాపారులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కేంద్రం వద్ద ప్రస్తుతం 25వేల టన్నుల ముందస్తు నిల్వలు ఉన్నాయని, ఇవి నవంబరు తొలివారంలో నిండుకుంటాయని నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ చద్ధా శుక్రవారం అన్నారు.
ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పెరగడంతో ఈ బఫర్ స్టాక్ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యవసర సమయాల్లో వినియోగానికి ముందస్తు నిల్వలు ఉపయోగిస్తారు. ఈ ఏడాది లక్ష టన్నుల వరకు ఉల్లిగడ్డలను నిల్వచేశారు. ఇప్పటి వరకు 43,000 టన్నులు ఈ బఫర్ స్టాక్ నుంచి వివిధ రాష్ట్రాలకు పంపారు.. కొంత వృధా కాగా.. మరో 25వేల టన్నులు ఉన్నాయని చద్ధా తెలిపారు. ప్రస్తుతం వీటిని కిలో రూ.26కే అందజేస్తామని, అదనంగా రవాణ ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు.
ఇక మహారాష్ర్టలోని పుణేలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 550 కిలోల ఉల్లిని దొంగతనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన నారాయణ్ గావ్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)